Share News

వై‘ఛీ’పీ పాలిటిక్స్‌!

ABN , Publish Date - Jan 05 , 2026 | 01:24 AM

వైసీపీ నేతల దౌర్జన్యం, గూండాగిరి పోకడలు గన్నవరం నియోజకవర్గంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అధికారంతో పాటు ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మాత్రం మారడం లేదు. విజయవాడ రూరల్‌ మండలం నున్నలో పక్షం రోజుల కిందట స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ గౌతు లచ్చన్న విగ్రహం దగ్గర మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడు, వైసీపీ నాయకుడు గుంటక భాస్కరరెడ్డి మూత్ర విసర్జన చేసిన ఉదంతం మరవకముందే వంశీ ప్రధాన అనుచరుడు భీమవరపు నరేందర్‌ రెడ్డి (చిన్నోడు) సర్దార్‌ గౌతు లచ్చన్న బస్టాప్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన గౌతు లచ్చన్న, టీడీపీ నాయకులతో కూడిన ఫ్లెక్సీని కత్తితో కోసి చించేశాడు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అక్కడే కారు ఎక్కుతుండగానే.. టీడీపీ నాయకులు చూస్తుండగానే ఈ పని చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది.

వై‘ఛీ’పీ పాలిటిక్స్‌!

-నున్నలో ఫ్లెక్సీ రగడ!

- టీడీపీ ఫ్లెక్సీ చింపేసిన మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరుడు భీమవరపు నరేందర్‌రెడ్డి

- రోడ్డుపై బైఠాయించి టీడీపీ నేతల ఆందోళన

- గెస్ట్‌హౌస్‌లో దాక్కున్న నరేందర్‌ రెడ్డిని పట్టుకున్న పోలీసులు

- అరెస్టు చేశాక.. రాజీకొచ్చిన వైసీపీ నాయకులు

- టీడీపీ నేతలను స్టేషన్‌కు పిలిచిన పోలీసులు

- మళ్లీ బూతు పురాణం అందుకున్న నరేందర్‌ రెడ్డి

- సర్దార్‌ గౌతు లచ్చన్న విగ్రహానికి పదే పదే అవమానం!

- పక్షం రోజుల కిందట వంశీ అనుచరుడు గుంటక భాస్కరరెడ్డి దారుణం

- సర్దార్‌ గౌతు లచ్చన్న విగ్రహం దగ్గర మూత్ర విసర్జన

వైసీపీ నేతల దౌర్జన్యం, గూండాగిరి పోకడలు గన్నవరం నియోజకవర్గంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అధికారంతో పాటు ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మాత్రం మారడం లేదు. విజయవాడ రూరల్‌ మండలం నున్నలో పక్షం రోజుల కిందట స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ గౌతు లచ్చన్న విగ్రహం దగ్గర మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడు, వైసీపీ నాయకుడు గుంటక భాస్కరరెడ్డి మూత్ర విసర్జన చేసిన ఉదంతం మరవకముందే వంశీ ప్రధాన అనుచరుడు భీమవరపు నరేందర్‌ రెడ్డి (చిన్నోడు) సర్దార్‌ గౌతు లచ్చన్న బస్టాప్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన గౌతు లచ్చన్న, టీడీపీ నాయకులతో కూడిన ఫ్లెక్సీని కత్తితో కోసి చించేశాడు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అక్కడే కారు ఎక్కుతుండగానే.. టీడీపీ నాయకులు చూస్తుండగానే ఈ పని చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/విజయవాడ రూరల్‌):

విజయవాడ రూరల్‌ మండలం నున్న గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆదివారం ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు చోట్ల టీడీపీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇదే సందర్భంలో నూజివీడు - విజయవాడ బైపాస్‌ మార్గం వెంబడి స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ గౌతు లచ్చన్న పేరుతో బస్టాప్‌ను ఏర్పాటు చేశారు. ఈ బస్టాప్‌ను కూడా యార్లగడ్డ ప్రారంభించారు. బస్టాప్‌ ప్రారంభోత్సవం కోసం సర్దార్‌ గౌతు లచ్చన్న, కొనకళ్ల నారాయణరావు, కొనకళ్ల బుల్లయ్య, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఫొటోతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. బస్టాప్‌కు ప్రారంభోత్సవం చేశాక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కారు ఎక్కుతున్న సమయంలో అకస్మాత్తుగా మోటార్‌ సైకిల్‌పై వచ్చిన వైసీపీ కార్యకర్త భీమరపు నరేంద్రరెడ్డి టీడీపీ ఫ్లెక్సీని చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు. బండ బూతులు తిడుతూ టీడీపీ నేతల ముందే ఫ్లెక్సీని కత్తి తీసుకుని కోసేశాడు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు పరుగున అక్కడికి వెళ్లేలోపు మోటార్‌సైకిల్‌పై నరేంద్రరెడ్డి వెళ్లిపోయాడు. వెంటనే ఈ విషయం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు ఫోన్‌ చేసి చెప్పారు. ఆయన స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టాలని, తాను కూడా పోలీసులతో మాట్లాడతానని వారికి సూచించారు.

రోడ్డుపై ఆందోళన

ఫ్లెక్సీ చించివేతపై స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహానికి గురై నరేంద్రరెడ్డి ఇంటి వద్దకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ముందే ఈ విషయాన్ని తెలుసుకుని నరేందర్‌ రెడ్డి ఇంటి నుంచి పారిపోయాడు. దీంతో టీడీపీ నాయకులు రోడ్డు మీదనే ఆందోళనకు దిగారు. ఈ లోపు ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు, ఆయన సోదరుడు కొనకళ్ల బుల్లయ్య అక్కడికి వచ్చారు. విషయం తెలుసుకుని వారు విచారం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలను వారించారు. వైసీపీ మూకలు రౌడీయిజం చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా అంటూ స్థానిక టీడీపీ నాయకులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ట్రాఫిక్‌ పెద్ద ఎత్తున నిలిచిపోయింది. ఏసీపీ స్రవంతిరాయ్‌, సీఐ కృష్ణమోహన్‌ టీడీపీ నేతలకు సర్ధిచెప్పారు. ఫ్లెక్సీని చింపినవాడిని పట్టుకుంటే ఆందోళన విరమిస్తామని టీడీపీ నేతలు పోలీసులకు గట్టిగా చెప్పారు. దీంతో పోలీసులు విచారించగా.. బ్యానర్‌ను కత్తితో కోసిన భీమరపు నరేంద్రరెడ్డి గ్రామ శివారున ఉన్న గెస్ట్‌ హౌస్‌లో తలదాచుకున్నాడని గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని నున్న రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. దీంతో టీడీపీ నేతలు ఆందోళన విరమించారు.

పోలీస్‌ స్టేషన్‌లోనూ నరేందర్‌రెడ్డి చిందులు

నున్న రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ (పాయకాపురం) తీసుకువచ్చిన తర్వాత కూడా భీమవరపు నరేందర్‌రెడ్డి చిందులు ఆగలేదు. నరేందర్‌ రెడ్డిని అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకువెళ్లారన్న సమాచారం వైసీపీ నేతలకు చేరింది. దీంతో వైసీపీ మాజీ ఎంపీపీ యర్కారెడ్డి నాగిరెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ జీతం శ్రీనివాసరావు, మాజీ ఉపసర్పంచ్‌ భీమవరపు శివరామిరెడ్డి, వీఎంసీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ అవుతు శైలజ భర్త అవుతు శ్రీనివాసరెడ్డి తదితరులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి నరేందర్‌ రెడ్డి కావాలని చేయలేదని, వెంటనే విడుదల చేయాల్సిందిగా పోలీసుల మీద ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో పోలీసులు ఆధారాల్లేకుండా తామేమీ అరెస్టు చేయలేదని.. సీసీటీవీ ఫుటేజీ చూపటంతో వైసీపీ నేతలు అవాక్కయ్యారు. వెంటనే రూటు మార్చి.. జరిగిందేదో జరిగిపోయింది.. వారికి మా వాడు క్షమాపణ చెబుతాడని, దీన్ని పెద్దది చేసుకోవటం ఎందుకని చెప్పడంతో పోలీసులు నరేందర్‌ రెడ్డిపై ఫిర్యాదు చేసిన టీడీపీ నున్న గ్రామ కార్యదర్శి మాదు శివరామ్‌ప్రసాద్‌, తెలుగు యువత నాయకుడు మాదు మహేష్‌, యర్కారెడ్డి కోటిరెడ్డి, కలకోటి శ్రీనివాసరెడ్డి తదితరులను స్టేషన్‌కు పిలిచారు. చేసిన తప్పుకు నరేందర్‌ రెడ్డి క్షమాపణలు చెబుతానంటున్నాడని.. మీరు ఏమంటారని అడిగారు. గతంలో కూడా వైసీపీ నాయకుడు గుంటక భాస్కరరెడ్డి సర్దార్‌ గౌతు లచ్చన్న విగ్రహం దగ్గర మూత్ర విసర్జన చేసి అవమానపరిచిన విషయాన్ని వారు ప్రస్తావించారు. ఈ దశలో వాద ప్రతివాదనలు సాగే క్రమంలో వంశీ అనుచరుడు వైసీపీ నేత భీమవరపు నరేందర్‌ రెడ్డి గౌడ సామాజిక వర్గాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ నాయకులు రివర్స్‌ అయ్యారు. ఇలాంటి వ్యక్తిని క్షమించేదే లేదని.. కేసు పెట్టాల్సిందేనని పట్టుబట్టారు. టీడీపీ నేత మాదు మహేశ్వరరావు ఫిర్యాదు మేరకు 324(4), 126(2), 351(2) సెక్షన్ల కింద నరేంద్రరెడ్డిపై కేసు నమోదు చేశారు.

Updated Date - Jan 05 , 2026 | 01:24 AM