అమరావతిలో ‘జేవియర్’ క్యాంపస్
ABN , Publish Date - Mar 14 , 2026 | 04:44 AM
ప్రతిష్ఠాత్మక జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఎక్స్ఎల్ఆర్ఐ) అమరావతిలో క్యాంపస్ ఏర్పాటుకు సిద్ధమైంది.
జంషెడ్పూర్, ఢిల్లీ తర్వాత ఏపీలో ప్రతిష్ఠాత్మక క్యాంపస్
రూ.300 కోట్ల పెట్టుబడితో.. 61.7 ఎకరాల్లో నిర్మాణం
ఏపీసీఆర్డీఏ, ఎక్స్ఎల్ఆర్ఐ మధ్య కుదిరిన ఒప్పందం
గుంటూరు, తుళ్లూరు, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మక జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఎక్స్ఎల్ఆర్ఐ) అమరావతిలో క్యాంపస్ ఏర్పాటుకు సిద్ధమైంది. ఆ సంస్థ ప్రతినిధులు ఏపీసీఆర్డీఏతో శుక్రవారం అగ్రిమెంట్ ఫర్ సేల్ కుదుర్చుకున్నారు. 61.7 ఎకరాల విస్తీర్ణంలో ఎక్స్ఎల్ఆర్ఐ క్యాంపస్ నిర్మించనుంది. సుమారు రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ క్యాంప్సలో మొదటి దశలో 1,000 మంది విద్యార్థుల కోసం సమగ్ర అకడమిక్ ప్రోగ్రామ్లు, 200 మంది వృత్తి నిపుణుల కోసం ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్లు నిర్వహించే ప్రణాళిక ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 1949లో స్థాపించిన ఎక్స్ఎల్ఆర్ఐ-జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, భారత్లోని పురాతన, ప్రతిష్ఠాత్మక బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం జంషెడ్పూర్, ఢిల్లీల్లో క్యాంప్సలున్నాయి.
రాజధానిలో ఎన్టీపీసీ కార్యాలయం..
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ లిమిటెడ్ అమరావతిలో కార్యాలయం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ సంస్థ శుక్రవారం ఏపీ సీఆర్డీఏతో లీజ్ ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో ఎన్టీపీసీ సంస్థ ఏర్పాటైతే రాజధాని ప్రాంతంలో సంస్థాగత, మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత బలం చేకూరుతుందని అధికారులు తెలిపారు.