నా భర్త హత్యపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించండి
ABN , Publish Date - Feb 01 , 2026 | 05:13 AM
పల్నాడు జిల్లా, మాచవరం మండలం, పిన్నెల్లి గ్రామానికి చెందిన మంద సాల్మన్ హత్య ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ మృతుడి భార్య మంద కుమారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టును ఆశ్రయించిన మంద సాల్మన్ భార్య
అమరావతి, జనవరి 31(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా, మాచవరం మండలం, పిన్నెల్లి గ్రామానికి చెందిన మంద సాల్మన్ హత్య ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ మృతుడి భార్య మంద కుమారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తులో పోలీసులు ఏకపక్షంగా, పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. జనవరి 11 నుంచి 13 వరకు మాచవరం పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ‘నా భర్త మంద సాల్మన్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున పనిచేశారు. ఈ ఏడాది జనవరి 10వ తేదీన ఇంటి బయట ఉన్న నా భర్తపై మోటమర్రి పేతూరు, అతడి తమ్ముడు కాంతారావు ఇనుపరాడ్లతో దాడి చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ జనవరి 15న నా భర్త సాల్మన్ మృతి చెందారు. అధికారపార్టీ నేతల సూచనలకు అనుగుణంగా, ఆధారాలు లేకుండా చేసి కేసును నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు అసాధారణంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో నా భర్త హత్యపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపేలా కేసును సీబీఐకి అప్పగించండి’ అని మంద కుమారి పిటిషన్లో కోరారు.