పేపర్ మిల్లు భూములు పేదలకిస్తాం --కర్నూలు ఎంపీ
ABN , Publish Date - Feb 18 , 2026 | 11:14 PM
కర్నూలు రూరల్ మండలం గొందిపర్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రాయలసీమ పేపర్ మిల్లుకు సంబంధించిన ప్రభుత్వ భూములను పేదలకు అందజేస్తామని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు.
అన్యాక్రాంతం కాకుండా చర్యలు
కర్నూలు రూరల్ ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): కర్నూలు రూరల్ మండలం గొందిపర్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రాయలసీమ పేపర్ మిల్లుకు సంబంధించిన ప్రభుత్వ భూములను పేదలకు అందజేస్తామని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు. బుధవారం ఆయన కర్నూలు ఆర్డీవో సందీప్కుమార్, రూరల్ తహసీల్దార్ వెంకటరమేష్బాబుతో కలిసి గొందిపర్లలో రాయలసీమ పేపర్ మిల్లు భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ రాయలసీమ పేపర్మిల్లుకు అప్పట్లో ప్రభుత్వం దాదాపు 60ఎకరాలు కేటాయించిందని వివరించారు. ప్రస్తుతం పేపర్ మిల్లు మూతపడటంతో ఆ భూములు నిరుపయోగంగా ఉన్నాయని, కొంత మంది నాయకులు రాజకీయ పలుకుబడితో అమ్మడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలన్న లక్ష్యంతో పేపర్ మిల్లు భూముల విషయం రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని ప్రసాద్, కలెక్టర్ డాక్టర్ సిరి, జాయింట్ కలెక్టర్ నూరల్ కమర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ నాగరాజు తెలిపారు. ఈ భూమిలో పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు.