Share News

జీ అంటే గూగుల్‌ వారికి మాత్రం గొడ్డలి

ABN , Publish Date - Apr 29 , 2026 | 04:12 AM

‘విశాఖపట్నం ఇప్పటివరకూ ఒక లెక్క... ఇకపై మరొక లెక్క’ అని రాష్ట్ర ఐటీ మంత్రి లోకేశ్‌ అన్నారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌కు...

జీ అంటే గూగుల్‌ వారికి మాత్రం గొడ్డలి

  • బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌

  • విశాఖ ఇప్పటివరకో లెక్క... ఇకపై మరొక లెక్క

  • గూగుల్‌ రాకతో ఎకో సిస్టమ్‌ మార్పు

  • దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25శాతం ఆంధ్రాకే

  • 20 లక్షల మందికి ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యం

  • గూగుల్‌ క్రెడిట్‌ కోసం ‘సీసీడీ రోగి’ ప్రయత్నిస్తారు

  • ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా వైజాగ్‌ రీజియన్‌: మంత్రి లోకేశ్‌

విశాఖపట్నం, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): ‘విశాఖపట్నం ఇప్పటివరకూ ఒక లెక్క... ఇకపై మరొక లెక్క’ అని రాష్ట్ర ఐటీ మంత్రి లోకేశ్‌ అన్నారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, గూగుల్‌ ప్రతినిధులతో కలసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ సభలో మాట్లాడారు. ‘‘ఇది భూమి పూజ మాత్రమే కాదు. విశాఖలో కొత్త చరిత్రకు 2026 ఏప్రిల్‌ 28 పునాది వేసిన పవ్రితమైన దినం. విశాఖ చరిత్ర ఈరోజు నుంచే మారిపోతుంది. వైజాగ్‌లో ‘జి’ అంటే మనకు గూగుల్‌... అదే వారికైతే(వైసీపీ) ‘గొడ్డలి’... ‘బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌’. విశాఖలో డేటా సెంటర్‌ నిర్మాణానికి అదానీతో పదేళ్ల క్రితమే పునాది వేయించాం. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో అరాచకం రాజ్యమేలింది. పెట్టుబడిదారులు పారిపోయారు. 2024 ఎన్నికల్లో ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు ఓట్లు వేయడంతో ఎన్‌డీఏ 94ు సీట్లను కైవసం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి పెట్టుబడుల ప్రయాణం మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌కు మూడు కారణాలతో పెట్టుబడులు పెద్దఎత్తున వస్తున్నాయి.


చంద్రబాబు విజనరీ నాయకత్వం, దానికి రుజువుగా కళ్ల ముందు కనపడుతున్న సైబరాబాద్‌ ఒక కారణమతే, స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ రెండో కారణం. ఏపీ ప్రభుత్వం డబుల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ ట్రైన్‌లా అత్యంత వేగంగా పరుగు తీస్తోంది. నాయుడు+మోదీ(నమో) మంత్రం మూడో కారణం. భారతదేశానికి ఏటా వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రకే వస్తున్నాయి. గూగుల్‌ డేటా సెంటర్‌ కోసం 2024 సెప్టెంబరులో ప్రాథమిక చర్చలు జరిగాయి. 12 నెలల తరువాత విశాఖలో పెట్టుబడులకు ప్రకటన వచ్చింది. ఇప్పుడది శంకుస్థాపన చేసుకుంది. దీని వెనుక కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, నిర్మలా సీతారామన్‌ల పాత్ర చాలా ఉంది. వారు లేకుండా గూగుల్‌ ప్రాజెక్టు లేదు. గూగుల్‌ విశాఖలో రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతోంది. నిర్మాణ సమయంలో 25 వేల మందికి ఉపాధి లభిస్తుంది. పూర్తయ్యాక 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. గూగుల్‌ రాకతో విశాఖ ఎకో సిస్టమే మారిపోతుంది’’ అని అన్నారు.


ఒక రాష్ట్రం.. ఒక రాజధాని

‘‘ఒక రాష్ట్రం.. ఒక రాజధాని విధానంతో ముందుకు వెళ్తున్నాం. అభివృద్ధిలో మాత్రం వికేంద్రీకృత విధానం అనుసరిస్తున్నాం. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంరఽధ ప్రాంతాలను వేర్వేరు రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. వీటి కోసం ప్రత్యేకంగా ఎకనామిక్‌ రీజియన్లు కూడా ఏర్పాటు చేశాం. మొత్తం 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. గూగుల్‌ క్రెడిట్‌ కూడా తీసుకోవడానికి ‘సీసీడీ(క్రెడిట్‌ చోరీ డిసీజ్‌) రోగి’ ప్రయత్నిస్తారు’’ అంటూ లోకేశ్‌ ఎద్దేవా చేశారు.

లాస్ట్‌ పంచ్‌ మనదైతే ఆ కిక్కే వేరబ్బా!!

లోకేశ్‌ తన ప్రసంగంలో పలు సినిమా డైలాగ్‌లు ఉపయోగించారు. పవన్‌ కల్యాణ్‌ డైలాగ్‌ ‘లాస్ట్‌ పంచ్‌ మనదైతే ఆ కిక్కే వేరప్పా’ అంటూ చమత్కరించారు. గూగుల్‌ కంపెనీకి రైతులు సంతోషంగా భూములు ఇస్తే, వైసీపీ ఎంపీ ద్వారా కేసు వేసి దానిని అడ్డుకోవాలని చూశారని ఆరోపించారు. విశాఖపట్నం ఎకనామిక్‌ రీజియన్‌ ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా అభివృద్ధి చెందుతుందన్నారు. గూగుల్‌ డేటా సెంటర్‌ నిర్మాణంలో సహకారం అందిస్తున్న అదానీ ఇన్‌ఫ్రా, భారతీ ఎయిర్‌టెల్‌కు, భూములిచ్చిన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Apr 29 , 2026 | 04:13 AM