విశాఖ ఉక్కులో పెట్టుబడికి రష్యా కంపెనీ ఆసక్తి
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:08 AM
విశాఖపట్నం స్టీల్ప్లాంటు (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-ఆర్ఐఎన్ఎల్)లో పెట్టుబడులు పెట్టడానికి రష్యా కంపెనీ ‘నోవోస్టల్-ఎం’ ఆసక్తి చూపుతోంది.
షిప్ బిల్డింగ్ స్టీల్ షీట్ల తయారీకి ప్రత్యేక ప్లాంటు
రూ.7 వేల కోట్లు పెట్టుబడికి ‘నోవోస్టల్-ఎం’ సిద్ధం
విశాఖపట్నం, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం స్టీల్ప్లాంటు (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-ఆర్ఐఎన్ఎల్)లో పెట్టుబడులు పెట్టడానికి రష్యా కంపెనీ ‘నోవోస్టల్-ఎం’ ఆసక్తి చూపుతోంది. దేశంలో నౌకా నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఏపీలో అనేక సంస్థలు షిప్ బిల్టింగ్ సెంటర్ల ఏర్పాటుకు ముందుకువస్తుండగా వాటికి ప్రభుత్వం సహకరిస్తోంది. అయితే నౌకల నిర్మాణానికి ప్రధాన ముడిసరకు మెరైన్ స్టీల్ చాలా పరిమితంగా దేశంలో తయారవుతోంది. మెరైన్ స్టీల్ ప్లేట్ల డిమాండ్ బాగా పెరగడంతో విశాఖలో ఈ తరహా ప్లాంటు నెలకొల్పాలని ‘నోవోస్టల్-ఎం’ భావిస్తోంది. సుమారు రూ.6 వేల నుంచి రూ.7 వేల కోట్ల పెట్టుబడితో, ఏడాదికి రెండు మిలియన్ టన్నుల స్టీల్ షీట్లు తయారు చేయాలని భావిస్తోంది. స్టీల్ ప్లాంటు సముద్ర తీరాన ఉండడంతో లాజిస్టిక్స్ సదుపాయాలు బాగుంటాయని, విశాఖ ఉక్కుకు బ్రాండ్ ఉండటం కలిసి వస్తుందని ఈ ప్రతిపాదన చేసినట్టు ఉక్కు వర్గాలు పేర్కొన్నాయి.