Share News

కొత్తగా ఏమీ తేలలేదు

ABN , Publish Date - Mar 11 , 2026 | 04:27 AM

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తును సీబీఐ ముగించింది. తదుపరి దర్యాప్తులో కొత్తగా ఏమీ తేలలేదని.. కొత్త నిందితులుగానీ, కొత్త ఆధారాలుగానీ లభించలేదని...

కొత్తగా ఏమీ తేలలేదు

  • కొత్త నిందితులు లేరు.. ఆధారాలు లేవు

  • తదుపరి దర్యాప్తు అంశాన్ని ముగించండి

  • వివేకా హత్య కేసులో మూడో అనుబంధ తుది అభియోగ పత్రం దాఖలు చేసిన సీబీఐ

హైదరాబాద్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తును సీబీఐ ముగించింది. తదుపరి దర్యాప్తులో కొత్తగా ఏమీ తేలలేదని.. కొత్త నిందితులుగానీ, కొత్త ఆధారాలుగానీ లభించలేదని హైదరాబాద్‌ నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు అంశాన్ని ముగించాలని కోరుతూ మూడో సప్లిమెంటరీ - ఫైనల్‌ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. తన తండ్రి కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలని కోరుతూ, వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌పై విచారణను ముగించిన సీబీఐ కోర్టు, ఈ కేసులో ఏ-7గా ఉన్న వైఎస్‌ భాస్కరరెడ్డి సోదరుడి మనవడు అర్జున్‌రెడ్డి, మరో నిందితుడు సునీల్‌ యాదవ్‌ (ఏ-2) కిరణ్‌ యాదవ్‌ మధ్య సందేశాలపై దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తదుపరి దర్యాప్తు చేపట్టిన సీబీఐ తాజాగా దీనిపై మూడో అనుబంధ తుది చార్జిషీట్‌ను దాఖలుచేసింది. ‘‘వివేకానందరెడ్డి చనిపోయిన 2019 మార్చి 14న రాత్రి కిరణ్‌యాదవ్‌ తన ఇంట్లోనే ఉన్నాడు. ఉదయం టీవీ చూస్తూ, వివేకా చనిపోయిన విషయం తెలుసుకున్నాడు. ఈ సమాచారాన్ని ఇద్దామని వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టు అర్జున్‌రెడ్డికి ఫోన్‌ చేశాడు. అర్జున్‌రెడ్డి ఫోన్‌లో అందుబాటులోకి రాకపోవడంతో ‘అన్నా.. వివేకం సర్‌ చనిపోయాడు’ అని ఆయన మొబైల్‌కు సందేశం పంపించాడు’ అని సీబీఐ పేర్కొంది. ఈ ఇద్దరి మధ్య సందేశాలకు సంబంధించిన అంశంపై దర్యాప్తు చేశామని.. ఎలాంటి కొత్త ఆధారాలు, కొత్త నిందితులు లేరని పేర్కొంది.

Updated Date - Mar 11 , 2026 | 04:28 AM