విశాఖ యువకుడి మ్యాట్రిమోనియల్ మోసం
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:02 AM
విశాఖపట్నం నుంచి ఉపాధి కోసం కంబోడియాకు వెళ్లిన యువకుడు... అక్కడ సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపాడు. మ్యాట్రిమోనియల్ సైట్లో అందమైన యువతిలా....
హైదరాబాద్ వాసికి రూ.11 లక్షలు టోకరా.. చెన్నైలో అరెస్టు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నుంచి ఉపాధి కోసం కంబోడియాకు వెళ్లిన యువకుడు... అక్కడ సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపాడు. మ్యాట్రిమోనియల్ సైట్లో అందమైన యువతిలా నకిలీ ప్రొఫైల్ సృష్టించి హైదరాబాద్ యువకుడి నుంచి రూ.11.17 లక్షలు కాజేశాడు. ఆ యువకుడి ఫిర్యాదుపై స్పందించిన నగర సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం నిందితుడిని చెన్నై ఎయిర్పోర్టులో అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు కేసు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన 28ఏళ్ల యువకుడికి ఒక విదేశీ నంబర్ నుంచి వాట్సాప్ సందేశం వచ్చింది. ‘నా పేరు అంజలి కందుల. షాదీ డాట్ కామ్లో మీ ప్రొఫైల్ చూశాను. నాకు నచ్చింది. నేను కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నా. ఇక్కడే స్థిరపడ్డాను. బాగా సంపాదించా’ అంటూ పరిచయం చేసుకుంది. ‘కొద్ది కాలం స్నేహంగా ఉందాం. ఇద్దరికీ కుదిరితే పెళ్లి చేసుకుందాం’ అని నమ్మించింది. ఆ తరువాత తన అంకుల్ నిర్వహిస్తున్న బ్యాక్ట్ కాయిన్ ప్లాట్ఫామ్లో పెట్టుబడులు పెడితే రూ.కోట్లు సంపాదించవచ్చని నమ్మబలికింది. ప్రారంభంలో చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టిన బాఽధితునికి వర్చువల్గా రూ.12.5 లక్షలు లాభాలు వచ్చినట్లు చూపించారు. వాటిని విత్డ్రా చేయాలంటే... పెద్ద మొత్తంలో పెట్టాలని చెప్పి రూ.11,17,834 గుంజారు. అయినా ఆ సొమ్ము విత్డ్రా చేయడం సాధ్యం కాలేదు. బాధితుడు నగర సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు పెద్దపూడి ప్రసన్నకుమార్ను అరెస్టుచేశారు.