విశాఖకు మరో ఐటీ పార్క్
ABN , Publish Date - Mar 14 , 2026 | 04:47 AM
విశాఖపట్నానికి మరో ఐటీ పార్క్ రాబోతోంది. మధురవాడ (రుషికొండ) ఐటీ హిల్స్లో గ్రేడ్-1 ఐటీ పార్క్ రూపుదిద్దుకోనుంది.
విశాఖ రియాలిటీ ప్రైవేటు లిమిటెడ్ రూ.2,200 కోట్ల పెట్టుబడి
30 వేలమందికి ఉద్యోగావకాశాలు.. మూడు దశల్లో గ్రేడ్-1 ఐటీ పార్క్
విశాఖపట్నం, మార్చి 13(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నానికి మరో ఐటీ పార్క్ రాబోతోంది. మధురవాడ (రుషికొండ) ఐటీ హిల్స్లో గ్రేడ్-1 ఐటీ పార్క్ రూపుదిద్దుకోనుంది. హిల్ 3 వెనుక 30 ఎకరాలను విశాఖ రియాలిటీ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వం కేటాయించింది. ఈ సంస్థ మూడు దశల్లో రూ.2,200 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ఐటీ పార్క్ ద్వారా 30 వేలమందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ కింద ఆ కంపెనీ దరఖాస్తు చేసింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సిఫారసు మేరకు గతేడాది నవంబరులో భూమిని కేటాయించారు. మూడు దశల్లో 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు నిర్మిస్తామని తెలిపింది. 10 లక్షల చ.అ. భవనం 2028 నాటికి పూర్తిచేస్తామని, మిగిలినవి 2029, 2030 నాటికి అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. ఈ సంస్థకు కేటాయించిన భూమి నుంచి 80 అడుగుల రహదారి ఉంది. దానిని 100 అడుగులుగా మార్చాలని ప్రభుత్వం వీఎంఆర్డీఏకు సూచించింది.