Share News

విశాఖకు మరో 3 డేటా సెంటర్లు

ABN , Publish Date - Aug 14 , 2026 | 05:20 AM

ఉమ్మడి విశాఖ జిల్లా డేటా సెంటర్ల హబ్‌గా మారుతోంది. తొలుత అదానీ డేటా సెంటర్‌కు ప్రభుత్వం భూములు కేటాయించగా, తరువాత గూగుల్‌ రాకతో ఒక్కసారిగా పెట్టుబడుల వెల్లువ మొదలైంది.

విశాఖకు మరో 3 డేటా సెంటర్లు

  • ఎస్‌ఐపీబీలో ప్రతిపాదనలు

  • నాలుగు వేల మందికి ఉద్యోగావకాశాలు

విశాఖపట్నం, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి విశాఖ జిల్లా డేటా సెంటర్ల హబ్‌గా మారుతోంది. తొలుత అదానీ డేటా సెంటర్‌కు ప్రభుత్వం భూములు కేటాయించగా, తరువాత గూగుల్‌ రాకతో ఒక్కసారిగా పెట్టుబడుల వెల్లువ మొదలైంది. తాజాగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో మరో మూడు డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. డేటా సెంటర్‌ హోల్డింగ్స్‌ ఇండియా సంస్థ రూ.58,743 కోట్ల పెట్టుబడితో 1,250మందికి ఉద్యోగాలు కల్పిస్తామంది. అలా గే అనకాపల్లి జిల్లాలో గ్రీన్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు రూ.85,200 కోట్ల పెట్టుబడి పెడతామని ‘రెన్యూ’ సంస్థ ప్రతిపాదన చేసింది. వేయి మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొంది. ఏఎం ఇంటెలిజెన్స్‌ ల్యాబ్స్‌ సంస్థ రూ. 31,387 కోట్లతో ఏఐ పవర్‌హౌస్‌ ఏర్పాటుచేస్తామని తెలిపింది. దీని ద్వారా వేయి మందికి ఉపాధి లభిస్తుందని వివరించింది. అక్షిత్‌ గ్రీన్‌టెక్‌ సంస్థ రూ.1,600 కోట్లతో 3.5గిగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ సెల్స్‌ తయారీ యూనిట్‌ పెడతామని, పరవాడలో భూమి కేటాయించాలని కోరింది. 725 మందికి ఉద్యోగాలిస్తామని, 2029నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపింది. వాటికి భూములు చూపించే బాధ్యత ఏపీఐఐసీకి అప్పగించారు.

Updated Date - Aug 14 , 2026 | 05:21 AM