స్టీల్ ప్లాంట్లో ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Jun 09 , 2026 | 06:29 AM
విశాఖపట్నం స్టీల్ప్లాంటులో పేలుడు ప్రమాదం అంతా నిమిషాల్లో జరిగిపోయింది. దగ్గరలో ఉన్న కార్మికులు ప్రమాదం నుంచి బయట పడటానికి కానీ.. వారికి సాయం చేయడానికి కానీ..
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం స్టీల్ప్లాంటులో పేలుడు ప్రమాదం అంతా నిమిషాల్లో జరిగిపోయింది. దగ్గరలో ఉన్న కార్మికులు ప్రమాదం నుంచి బయట పడటానికి కానీ.. వారికి సాయం చేయడానికి కానీ.. ఏమాత్రం అవకాశం, సమయం లేనివిధంగా ఘోరం జరిగిపోయింది. ల్యాడిల్లోని సుమారు 1500-2000 డిగ్రీల వేడి గల ద్రవపు ఉక్కు ఒక్కసారిగా పేలడంతో వెంటనే మంటలు చెలరేగాయి. కార్మికులు అగ్నికీలల్లో కాలిపోయి బొగ్గులా మారిపోయారు. ప్రమాదం ఎలా జరిగిందంటే...
స్టీల్ ఉత్పత్తిలో భాగంగా బ్లాస్ట్ ఫర్నేస్లో తయారు చేసిన ద్రవపు ఉక్కు(హాట్ మెటల్)ను ల్యాడిల్ ద్వారా స్టీల్ మెల్టింగ్ షాపు (ఎస్ఎంఎస్) విభాగంలోకి తీసుకువెళ్తున్నారు. అది 1,500 డిగ్రీల నుంచి 2000 డిగ్రీల వేడితో ఉంది. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు.
అప్పుడప్పుడు ల్యాడిల్ బ్యాలెన్స్ తప్పి కొంత హాట్ మెటల్ కిందకు పడిపోతుంటుంది. అలాగే ల్యాడిల్కు రంధ్రం పడి కూడా కారిపోతుంటుంది. అయితే ఈ సారి అలా జరగలేదు. ల్యాడిల్లో హాట్మెటల్ ఏ కారణంగానో ఒక్కసారిగా పేలిపోయింది.
పేలుడు జరిగిన సమయంలో ల్యాడిల్లో 150 టన్నుల సలసలా కాగుతున్న ద్రవపు ఉక్కు ఉంది. పేలుడు ధాటికి ల్యాడిల్ తునాతునకలైపోవడంతో హాట్ మెటల్ నలువైపులా చెల్లాచెదురుగా పడింది. దీంతో క్షణాల్లో ఎక్కడికక్కడే మంటలు చెలరేగాయి.
హాట్ మెటల్ కింద పడి మంటలు చెలరేగిన ప్రాంతం దగ్గరలో కంట్రోల్ రూమ్ ఉంది. కంట్రోల్ రూమ్లో ఉన్న ఉద్యోగులు కూడా మంటల్లో చిక్కుకున్నారు. ఇలా ల్యాడిల్పైన ఉంటుండగానే పేలడం విశాఖ ఉక్కు చరిత్రలో ఇదే ప్రథమం.