విశాఖలో రూ.250 కోట్లతో ‘పీవీఆర్’ ఫైవ్ స్టార్ హోటల్
ABN , Publish Date - Mar 22 , 2026 | 04:01 AM
విశాఖపట్నంలో రూ.250 కోట్లతో పీవీఆర్ గ్రూపు ఫైవ్ స్టార్ హోటల్ నిర్మిస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు.
శంకుస్థాపన చేసిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్
విశాఖపట్నం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో రూ.250 కోట్లతో పీవీఆర్ గ్రూపు ఫైవ్ స్టార్ హోటల్ నిర్మిస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి శనివారం ఆయన ఎండాడలో హోటల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన సీఐఐ పెట్టుబడిదారుల సదస్సులో చేసుకున్న ఒప్పందాలన్నీ కార్యరూపం దాలుస్తున్నాయని తెలిపారు. మూడు ఎకరాల విస్తీర్ణంలో, అంతర్జాతీయ ప్రమాణాలతో పీవీఆర్ హోటల్ నిర్మితమవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, గ్రూపు చైర్మన్ ఆర్వీ స్వామి, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ కళ్యాణి, డీవీఎం జగదీశ్, డీటీఓ మాధవి తదితరులు పాల్గొన్నారు.