డిఫెన్స్ సెక్యూరిటీ కోర్ ఉద్యోగి ఆత్మహత్య
ABN , Publish Date - Jun 21 , 2026 | 05:30 AM
విశాఖలోని నేవల్ డిఫెన్స్ క్వార్టర్స్లో ఒక ఉద్యోగి తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
సెంట్రీ డ్యూటీలో తుపాకీతో కాల్చుకుని బలవన్మరణం
మురళీనగర్ (విశాఖపట్నం), జూన్ 20 (ఆంధ్రజ్యోతి): విశాఖలోని నేవల్ డిఫెన్స్ క్వార్టర్స్లో ఒక ఉద్యోగి తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 104 ఏరియా ఆశవానిపాలెం సమీపంలోని నౌశక్తినగర్లో శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రలోని పూణేకు చెందిన మోర్ పరాగ్ సురేశ్ (42) ఆర్మీలో పదిహేనేళ్లపాటు పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం వెపన్ ఎక్విప్మెంట్ డెవల్పమెంట్-డిఫెన్స్ సెక్యూరిటీ కోర్ (డబ్ల్యూఈడీ-డీఎస్సీ)లో వాచ్మన్గా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి నేవల్ ఢిఫెన్స్ క్వార్టర్స్లో సురేశ్ డ్యూటీలో ఉన్నారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తన వద్ద ఉన్న ఇన్సాస్ వెపన్ (ఏకే 47 తరహా తుపాకీ)తో కాల్చుకున్నారు. వ్యక్తిగత కారణాలతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్లో పేర్కొన్నట్టు తెలిసింది. సీఐ శంకర నారాయణ కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.