ఎండాడ భూమిపై విచారణ
ABN , Publish Date - Jul 06 , 2026 | 05:58 AM
విశాఖలోని ఎండాడలోని 30 ఎకరాల ప్రభుత్వ భూమిని గోల్మాల్ చేసేందుకు జరిగిన ప్రయత్నాలపై విచారణ చేస్తామని జాయింట్ కలెక్టర్ విద్యాధరి తెలిపారు.
సర్వే అధికారిపై చర్యలు నిజమే.. విశాఖ జేసీ విద్యాధరి ప్రకటన
విశాఖపట్నం, జూలై 5(ఆంధ్రజ్యోతి): విశాఖలోని ఎండాడలోని 30 ఎకరాల ప్రభుత్వ భూమిని గోల్మాల్ చేసేందుకు జరిగిన ప్రయత్నాలపై విచారణ చేస్తామని జాయింట్ కలెక్టర్ విద్యాధరి తెలిపారు. ఈ భూమిని పరాధీనం చేసే ప్రయత్నాలకు సంబంధించి ఆధారాలు, డాక్యుమెంట్లు, ఇతర కీలక సమాచారం ఎవరివద్ద ఉన్నా అందించాలని కోరారు. ‘రూ.600 కోట్ల భూమికి స్కెచ్వేశారు’ శీర్షికతో శనివారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై జేసీ స్పందించారు. ఒక భూమి విషయమై సర్వే ఉప సంచాలకుడిని సంజాయిషీ కోరిన మాట వాస్తవమే అని తెలిపారు. ఈ అంశంలో తన పరిమితికి మించి నివేదికలు సమర్పించడంతోపాటు అందుబాటులో ఉన్న నివేదికలు, రికార్డులను విస్మరించినందున ఆయనపై పరిపాలనా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఎండాడలో రీసర్వే అధారంగా ఎలాంటి రికార్డులు మార్చలేదని వివరణ ఇచ్చారు.