Share News

కోడికత్తి కేసులో అనుమానాల నివృత్తికి విచారణ వాయిదా

ABN , Publish Date - Apr 28 , 2026 | 04:32 AM

విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో తనపై కోడికత్తితో దాడి చేసిన ఘటనకు సంబంధించి లోతైన విచారణ జరపాలని చేసిన అభ్యర్థనను ఎన్‌ఐఏ కోర్టు తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ...

కోడికత్తి కేసులో అనుమానాల నివృత్తికి విచారణ వాయిదా

  • మే 6కి వాయిదా వేసిన హైకోర్టు

  • లోతైన దర్యాప్తు జరపాలన్న జగన్‌ వినతిని 2023లో కొట్టివేసిన బెజవాడ ఎన్‌ఐఏ కోర్టు

  • ఆ ఉత్తర్వులు చెల్లవని వాదించిన న్యాయవాది

  • చెల్లుబాటవుతాయని ఏఎస్‌జీ స్పష్టీకరణ

  • నిందితుడు శ్రీనివాసరావు తరఫు సీనియర్‌ లాయర్‌దీ ఇదే మాట

అమరావతి, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో తనపై కోడికత్తితో దాడి చేసిన ఘటనకు సంబంధించి లోతైన విచారణ జరపాలని చేసిన అభ్యర్థనను ఎన్‌ఐఏ కోర్టు తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ మాజీ సీఎం జగన్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. సుదీర్ఘంగా వాదనలు విన్న అనంతరం అనుమానాల నివృత్తికి విచారణను మే 6కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌పై నిందితుడు జె.శ్రీనివాసరావు కోడి కత్తితో దాడి చేశారని పేర్కొంటూ 2018లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడిపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ సంబంధిత కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. కోడికత్తి దాడి ఘటనలో ఎలాంటి కుట్రకోణమూ లేదని తేల్చిచెప్పింది. అభియోగాలు నమోదు చేసిన ఎన్‌ఐఏ కోర్టు.. కేసు విచారణ షెడ్యూల్‌ను ప్రకటించింది. సాక్షుల వాంగ్మూలం నమోదు ప్రక్రియను ప్రారంభించింది. కుట్రకోణంలో లోతైన దర్యాప్తు చేయాలన్న జగన్‌ అభ్యర్ధనను 2023 జూలై 25న ఎన్‌ఐఏ కోర్టు తోసిపుచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ అదే ఏడాది జగన్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు విశాఖ ఎన్‌ఐఏ కోర్టులో కేసు విచారణను నిలుపుదల చేస్తూ 2023 అక్టోబరులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. క్వాష్‌ పిటిషన్‌పై ఇటీవల తుది విచారణ ప్రారంభించింది. సోమవారం వ్యాజ్యం విచారణకు రాగా.. జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు.


ఎన్‌ఐఏ విస్తృత కుట్రకోణం విషయంలో దర్యాప్తు సాగించలేదన్నారు. విచారణ పరిధి లేకున్నా విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు జూలై 25న అనుబంధ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఇవి చెల్లుబాటు కావన్నారు. ఇక, కేరళ హైకోర్టు తీర్పు ప్రకారం ఈ వ్యాజ్యం డివిజన్‌ బెంచ్‌ ముందు విచారణకు రావలసి ఉందని ఎన్‌ఐఏ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చల్లా ధనంజయ తెలిపారు. రాష్ట్రంలో ఎన్‌ఐఏ కేసుల విచారణకు కోర్టుల పరిధిని నిర్ణయిస్తూ 2023 జూలై 24న కేంద్రం గెజిట్‌ మాత్రమే జారీ చేసిందని.. కోర్టు ఏర్పాటు ప్రక్రియ పూర్తి కాలేదన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు జూలై 25న జారీ చేసిన ఉత్తర్వులు చెల్లుబాటవుతాయని తెలిపారు.

Updated Date - Apr 28 , 2026 | 04:33 AM