Share News

ఏఐ, డిజిటల్‌లో అగ్రగామిగా విశాఖ

ABN , Publish Date - Aug 06 , 2026 | 05:08 AM

పెట్టుబడులు సాధించడమే కాకుండా ప్రపంచ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్‌ను కీలకంగా మార్చేందుకు అవసరమైన ఎకో సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్‌ అన్నారు.

ఏఐ, డిజిటల్‌లో అగ్రగామిగా విశాఖ

  • ప్రపంచ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో ఏపీ కీలకం

  • దానికోసం ఎకో సిస్టం అభివృద్ధి చేస్తాం: మంత్రి లోకేశ్‌

  • విశాఖలో ఐబీఎం సెంటర్‌ ప్రారంభం

విశాఖపట్నం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడులు సాధించడమే కాకుండా ప్రపంచ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్‌ను కీలకంగా మార్చేందుకు అవసరమైన ఎకో సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్‌ అన్నారు. విశాఖపట్నంలో ఐబీఎం కొత్తగా ఏర్పాటు చేసిన ‘కన్సల్టింగ్‌ ఫ్యూచర్‌ నౌ సెంటర్‌’ను ఐబీఎం ఇండియా, సౌత్‌ ఏసియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ పటేల్‌తో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సెంటర్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులకు కన్సల్టింగ్‌, ఏఐ, క్లౌడ్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌, డేటా అనలిటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ వంటి కీలక సేవలను అందిస్తామని నిర్వాహకులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ, ఏపీ పట్ల ఐబీఎం చూపుతున్న నిబద్ధతను ప్రసంశించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో విశాఖపట్నాన్ని దేశంలోనే అగ్రగామి కేంద్రాల్లో ఒకటిగా తయారు చేయడానికి ఐబీఎంతో కలిసి పనిచేస్తామన్నారు. సందీప్‌ పటేల్‌ మాట్లాడుతూ, వికసిత్‌ భారత్‌-2047 లక్ష్యసాధనలో డిజిటల్‌ ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం భారత్‌కు లభిస్తుందన్నారు. మేనేజింగ్‌ పార్టనర్‌ ఉషా శ్రీకాంత్‌ మాట్లాడుతూ, స్థానిక యువతకు మరింత మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. అంతకుముందు మంత్రి లోకేశ్‌ అక్కడి ఉద్యోగులతో మాట్లాడుతూ, రాష్ట్రం గర్వపడేలా పనిచేయాలని కోరారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

Updated Date - Aug 06 , 2026 | 05:11 AM