విజయవాడ-వారాణసీ విమాన సర్వీసు ప్రారంభం
ABN , Publish Date - Aug 14 , 2026 | 05:26 AM
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారాణసీకి విమాన సర్వీసు ప్రారంభమైంది. దీనిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు గురువారం వర్చువల్గా ప్రారంభించారు.
గన్నవరం, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారాణసీకి విమాన సర్వీసు ప్రారంభమైంది. దీనిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు గురువారం వర్చువల్గా ప్రారంభించారు. ఇండిగో సంస్థ వారంలో మూడు రోజులు ఈ సర్వీసును నడపనుంది. మంగళ, గురు, శనివారాల్లో వారాణసీ నుంచి విజయవాడ విమానాశ్రయానికి సాయంత్రం 5.30 గంటలకు చేరుకుని 6.10 గంటలకు తిరిగి వెళ్తుంది. తొలిరోజు ఈ విమానంలో 130మంది విజయవాడ నుంచి వారాణసీ, కోల్కతాకు వెళ్లారు. కాగా, మధ్యాహ్నం 2.10 గంటలకు విమానం కోల్కతాలో బయల్దేరి 3.55 గంటలకు వారాణసీ, సాయంత్రం 5.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. సాయంత్రం 6.10 గంటలకు బయల్దేరి రాత్రి 8.15 గంటలకు వారాణసీ చేరుకుని, అక్కడి నుంచి కోల్కతాకు రాత్రి 10.15 గంటలకు వెళ్తుంది. విజయవాడ నుంచి దుబాయ్కి కూడా అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించాలని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడును ఎంపీ వల్లభనేని బాలశౌరి కోరారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎయిర్పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంత్రెడ్డి పాల్గొన్నారు.