యుద్ధం వద్దు - శాంతి ముద్దు
ABN , Publish Date - Apr 15 , 2026 | 05:38 AM
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, శాంతి సాధన కోసం విజయవాడలో ప్రముఖులు, మతపెద్దలు విస్తృత స్థాయిలో శాంతి ర్యాలీ నిర్వహించారు.
విజయవాడలో పీస్ ఫోరం ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ
విజయవాడ, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, శాంతి సాధన కోసం విజయవాడలో ప్రముఖులు, మతపెద్దలు విస్తృత స్థాయిలో శాంతి ర్యాలీ నిర్వహించారు. పీస్ ఫోరం విజయవాడ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, మేధావులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మత పెద్దలు పాల్గొన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో ‘‘యుద్ధం వద్దు - శాంతి ముద్దు’’ అనే నినాదాలతో నగర వీధులు మార్మోగాయి. ర్యాలీలో శాంతికి ప్రతీకగా తెల్ల జెండాలు, ప్లకార్డులు ప్రదర్శించగా, యుద్ధాల వల్ల కలిగే ప్రాణ, ఆస్తి నష్టాలను వివరించారు. సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు. ర్యాలీ అనంతరం జరిగిన సభలో పలువురు ప్రముఖులు మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని ప్రభావం మొత్తం మానవాళిపై పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. మతాల అసలు సారం శాంతి, ప్రేమ, సహనమని, మానవత్వమే మతాల మూలమని పేర్కొన్నారు. వివిధ మతాల పెద్దలు కలిసి సర్వమత ప్రార్థనలు నిర్వహించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.