Share News

చిట్టీల పేరుతో రూ.4కోట్లకు కుచ్చుటోపీ

ABN , Publish Date - Mar 02 , 2026 | 04:04 AM

ఆర్థిక అవసరాలకు అండగా ఉంటుందని చిట్టీలు వేసిన వారిని నిర్వాహకుడు నిలువునా ముంచేశాడు. రూ.4 కోట్లు వసూలు చేసి కుటుంబంతో సహా పరారయ్యాడు.

చిట్టీల పేరుతో రూ.4కోట్లకు కుచ్చుటోపీ

  • సభ్యులను నిలువునా ముంచి నిర్వాహకుడి పరార్‌

  • పోలీసులను ఆశ్రయించిన బాధితులు

  • విజయవాడలో ఘటన

విజయవాడ/చిట్టినగర్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక అవసరాలకు అండగా ఉంటుందని చిట్టీలు వేసిన వారిని నిర్వాహకుడు నిలువునా ముంచేశాడు. రూ.4 కోట్లు వసూలు చేసి కుటుంబంతో సహా పరారయ్యాడు. ఈ ఘట న విజయవాడలోని చిట్టినగర్‌లో ఆదివారం వెలుగులోకి వచ్చింది. తుమ్మల ముత్యాలరావు వీధిలో నివాసం ఉంటు న్న ఎం.శ్రీనివాసరావు 20 ఏళ్లుగా చిట్టీలు నిర్వహిస్తున్నాడు. అతడు ఇక్కడే పుట్టి పెరగడంతో స్థానికులందరికీ సుపరిచితుడు. చిట్టీల వ్యాపారం మొదలుపెట్టాక స్థానికంగా ఉండే కూలీలు, కార్మికులను ఇందులో సభ్యులుగా చేర్పించాడు. తొలుత రూ.లక్ష నుంచి వేయడం ప్రారంభించాడు. తర్వాత వాటిని క్రమంగా పెంచుకుంటూ రూ.5 లక్షలు, రూ.10 లక్షల వరకు నిర్వహించాడు. కాలపరిమితి పూర్తయ్యాక చెల్లింపులు సక్రమంగా చెల్లించాడు. మరోపక్క వడ్డీలకు అప్పులు ఇస్తుండేవాడు. కేదారేశ్వరపేటలోని లోటస్‌ ల్యాండ్‌మార్క్‌లో ఖరీదైన ఫ్లాట్‌ కొని, రెండేళ్ల క్రితం కుటుంబాన్ని అక్కడికి మార్చేశాడు. అప్పటి నుంచి చిట్టినగర్‌లో ఉంటున్న ఇంటికి వచ్చి చిట్టీ పాటలు నిర్వహించేవాడు. కాగా, చిట్టీలు పాడుకున్న వారికి తొలుత సక్రమంగా చెల్లింపులు చేసిన శ్రీనివాసరావు ఏడాదిగా వాయిదాలు వేయడం మొదలుపెట్టాడు. నెలల తరబడి ఇంటి చుట్టూ తిప్పించుకున్నాడు. ఎంతకీ డబ్బు ఇవ్వకపోవడంతో చిట్టీలు వేసిన వారంతా లోట్‌సలోని ఇంటికి వెళ్లి చూశారు. ఇంటిని ఖాళీ చేసి రెండు రోజుల క్రితం శ్రీనివాసరావు కుటుంబం ఊరు దాటినట్టు స్థానికులు తెలిపారు. దీంతో బాధితులు కొత్తపేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

Updated Date - Mar 02 , 2026 | 04:05 AM