పుదీనా మొక్క రూ.25.. వేప రూ.500
ABN , Publish Date - Apr 25 , 2026 | 04:27 AM
విజయవాడ గుణదలలోని విద్యుత్తు సౌధ ఆవరణలో సుందరీకరణ, కొన్ని అభివృద్ధి పనులకోసం శుక్రవారం రూ.7 లక్షలతో టెండరు పిలిచారు. ఇందులో మొక్కల పెంపకం కోసం రూ.2.50 లక్షలు కేటాయించారు.
యాలకుల మొక్కలూ పెంచేస్తారట.. విద్యుత్తు సౌధ సుందరీకరణలో సిత్రాలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
విజయవాడ గుణదలలోని విద్యుత్తు సౌధ ఆవరణలో సుందరీకరణ, కొన్ని అభివృద్ధి పనులకోసం శుక్రవారం రూ.7 లక్షలతో టెండరు పిలిచారు. ఇందులో మొక్కల పెంపకం కోసం రూ.2.50 లక్షలు కేటాయించారు. మొత్తం చిన్నదే కానీ, అందులో చిత్రాలు అనేకం! అదేవిధంగా మొక్కలు నాటడం, పెంపకం కోసం ఈ మొత్తంలో సుమారు రూ.2.50 లక్షలు కేటాయించారు. మార్కెట్లో రూ.25 పెడితే పెద్దసైజు పుదీనా కట్ట వస్తుంది. కానీ... ఒక్క పుదీనా మొక్కను రూ.25తో కొనేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వేప, కానుగ, కదంబం వంటి మొక్క ఒక్కో దానికి రూ.500 ధర నిర్ణయించారు. అటవీశాఖ నర్సరీల్లో వీటి ధర ఒక్కోటి రూ.వందలోపే! యాలకులు, లావెండర్ మొక్కలు చల్లటి వాతావరణంలోనే పెరుగుతాయి. బెజవాడ ఎండలకు అవి మాడిమసైపోతాయి. కానీ... విద్యుత్ సౌధ ఆవరణలో వాటినీ పెంచుతారట! ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడా యాలకులు, లావెండర్ మొక్కలను పెంచిన దాఖలాల్లేవు. ఇదంతా ఒక ఎత్తైతే... ఒక్కో మొక్క నాటేందుకు రూ.3.40 చెల్లిస్తామని టెండరులో పేర్కొనడం మరో ఎత్తు!