నిరసన ‘ఘాట్’
ABN , Publish Date - Apr 14 , 2026 | 06:47 AM
జాతీయ రహదారి (ఎన్హెచ్-65) విస్తరణలో కోల్పోయిన తన భూమికి, చెట్లకు పరిహారం ఇవ్వకుండా మోసం చేశారంటూ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి...
పరిహారం కోసం కారం చల్లిన వృద్ధురాలు
ఎన్టీఆర్ కలెక్టరేట్ భూసేకరణ కార్యాలయంలో ఘటన
విజయవాడ, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి (ఎన్హెచ్-65) విస్తరణలో కోల్పోయిన తన భూమికి, చెట్లకు పరిహారం ఇవ్వకుండా మోసం చేశారంటూ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన వృద్ధురాలు మల్లెంపూడి లక్ష్మీతులసి సోమవారం విజయవాడ కలెక్టరేట్లోని భూ సేకరణ విభాగ కార్యాలయంలో కారం చల్లి నిరసన తెలిపారు. నాలుగు కేజీల కారాన్ని భూసేకరణ కార్యాలయంలోని గదుల్లోనూ, కుర్చీల మీద చల్లడంతో..ఆ ఘాటు భరించలేక ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. ఆపై కార్యాలయం బయట బైఠాయించిన లక్ష్మీ తులసిని వారించి, రికార్డులు పరిశీలించగా.. ఆమెకు పరిహారం చెల్లించినట్టుగా ఉందని రెవెన్యూ సిబ్బంది తెలిపారు. అయినప్పటికీ లక్ష్మీ తులసి అభియోగాల మేరకు.. ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీ నరసింహం పునర్విచారణకు ఆదేశించారు. లక్ష్మీ తులసి మాత్రం తన భూమికి సంబంధించిన పరిహారం వేరొకరికి వేశారని, ఇంకా తనకు రూ.24 లక్షలు రావాల్సి ఉందని చెప్పారు.