విద్యార్థుల భవిష్యత్కు దిక్సూచి విద్యాజ్యోతి
ABN , Publish Date - Apr 11 , 2026 | 03:04 AM
ఇంటర్ తర్వాత ఏ కోర్సు తీసుకోవాలి? ఏ కాలేజ్లో చేరాలి? ఫీజులు ఎలా ఉంటాయి? గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఈ...
కోర్సులు, కాలేజీల ఎంపికకు చక్కటి మార్గం
అనంతపురంలో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎడ్యుకేషన్ ఎక్స్పోలో అధికారులు, విద్యావేత్తలు
అనంతపురం విద్య, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): ఇంటర్ తర్వాత ఏ కోర్సు తీసుకోవాలి? ఏ కాలేజ్లో చేరాలి? ఫీజులు ఎలా ఉంటాయి? గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఈ సందేహాలు సహజం. ఈ పరిస్థితులను గమనించిన ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలను ఒకేచోటకు రప్పించి, ఎడ్యుకేషన్ ఎక్స్పో నిర్వహించడం గొప్ప ఆలోచన అని ఆర్ఐవో వెంకటరమణ నాయక్ అభినందించారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని కమ్మ భవన్లో శుక్రవారం ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో విద్యాజ్యోతి పేరుతో మెగా ఎడ్యుకేషన్ ఎక్స్పోను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐవో వెంకటరమణ నాయక్, సమగ్రశిక్ష ఏపీసీ శైలజ, రేవా యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ధనుంజయ, కమ్మ సంఘం నాయకులు బాంబే డయింగ్ నాగన్న ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎక్స్పోలో ఇంజనీరింగ్ కళాశాలల స్టాల్స్ను పరిశీలించి, కోర్సులు, ఫీజులు, వసతి, ప్లేస్మెంట్స్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్ఐవో మాట్లాడుతూ మెగా ఎడ్యుకేషన్ ఎక్స్పో చాలా బాగుందని, అనంతపురం జిల్లాలోని విద్యార్థులకు ఇది మంచి అవకాశమని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన 30కి పైగా విద్యాసంస్థలు, వాటిలో అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలు తెలుసుకుని, ఆసక్తి ఉన్న కోర్సులను తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో బెంగళూరు ‘ఆంధ్రజ్యోతి’ జనరల్ మేనేజర్ శ్రీకాంత్, అనంతపురం బ్రాంచ్ మేనేజరు గోపాల్నాయుడు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.