నేడు ముసునూరుకు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్
ABN , Publish Date - Aug 24 , 2026 | 06:04 AM
దేశంలో తొలి నాన్- జీఎంవో పాప్కార్న్ (జన్యుపరంగా మార్పు చెందని మొక్కజొన్న) హైబ్రిడ్ విత్తనాన్ని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు సంయుక్తంగా సోమవారం ఆవిష్కరించనున్నారు.
సీఎం చంద్రబాబుతో కలిసి హైబ్రిడ్ మొక్కజొన్న వంగడం ఆవిష్కరణ
ఆసియాలోనే అతి పెద్ద పాప్కార్న్ ప్లాంట్ సందర్శన
అమరావతి, ముసునూరు, ఆగస్టు23 (ఆంధ్రజ్యోతి): దేశంలో తొలి నాన్- జీఎంవో పాప్కార్న్ (జన్యుపరంగా మార్పు చెందని మొక్కజొన్న) హైబ్రిడ్ విత్తనాన్ని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు సంయుక్తంగా సోమవారం ఆవిష్కరించనున్నారు. ఇందుకు ఏలూరు జిల్లా ముసునూరులోని గౌర్మెట్ పాప్కార్నికా ఫ్యాక్టరీ వేదిక కానున్నది. రైతుల పంటకు విలువ జోడించి, ప్రాసెసింగ్, బ్రాండింగ్తో మార్కెట్కు తరలించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రయోగంలో భాగంగా గౌర్మెట్ పాప్కార్నికా సంస్థ ఆధ్వర్యంలో ఈ హైబ్రిడ్ విత్తనాన్ని రూపొందించారు. కాగా, ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు ఉదయం 9.30 నిమిషాలకు ఉప రాష్ట్రపతి చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ఇతర ప్రజా ప్రతినిధులు ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ఉప రాష్ట్రపతి రోడ్డు మార్గం ద్వారా ముసునూరు చేసుకుని పాప్ కార్నికా సీడ్ను ఆవిష్కరిస్తారు. ఆదర్శ రైతులను సన్మానిస్తారు. అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.45 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. ఉప రాష్ట్రపతి పర్యటన సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కాగా, ముసునూరులోని ప్లాంట్ ఆసియాలోనే అతి పెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రాల్లో ఒకటిగా నిర్మించారు. దేశంలోని వేలాది సినిమా థియేటర్లకు పాప్కార్న్ సరఫరా చేయడంలో కీలకంగా ఉన్న ఈ సంస్థ, దేశవ్యాప్తంగా వేల ఎకరాల్లో సాగుతో వేలాది మంది రైతులతో భాగస్వామ్యం కలిగి ఉంది.