వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి కన్నుమూత
ABN , Publish Date - May 18 , 2026 | 05:01 AM
విశ్వహిందూపరిషత్ (వీహెచ్పీ) రాష్ట్ర అధ్యక్షుడు, కర్నూలు నగరవాసి నందిరెడ్డి సాయిరెడ్డి (75) కన్నుమూశారు.
నేడు కర్నూలులో అంత్యక్రియలు
కర్నూలు కల్చరల్, మే 17 (ఆంధ్రజ్యోతి): విశ్వహిందూపరిషత్ (వీహెచ్పీ) రాష్ట్ర అధ్యక్షుడు, కర్నూలు నగరవాసి నందిరెడ్డి సాయిరెడ్డి (75) కన్నుమూశారు. నెల రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. అభిమానులు, వీహెచ్పీ కార్యకర్తల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని కర్నూలులోని చైతన్యపురి కాలనీలో స్వగృహంలో సోమవారం ఉదయం 9 గంటల వరకు ఉంచుతారని, తదనంతరం అంతిమయాత్ర ప్రారంభించి, పాతనగరంలోని జమ్మిచెట్టు వద్ద ఉన్న హరిశ్చంద్ర ఘాట్లో కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారని వీహెచ్పీ రాష్ట్ర మీడియా కన్వీనర్ మాళిగి భానుప్రకాశ్ తెలిపారు. వీహెచ్పీలోకి 2012లో ప్రవేశించిన సాయిరెడ్డి... 2015లో దక్షిణాంధ్ర ప్రాంత కార్యాధ్యక్షుడి(రాష్ట్ర అధ్యక్షుడు)గా నియమితులై రాష్ట్రవ్యాప్తంగా వీహెచ్పీ కార్యక్రమాలను ఉధృతం చేశారు. బజరంగ్దళ్లో ఆయాం ప్రభారిగా ఉంటూ యువతను ఉత్సాహపరుస్తూ వీరహనుమాన్ విజయయాత్రలు, అభ్యాస వర్గలు, ర్యాలీలు, ధర్నాలు చేపట్టి.. హిందూ ధర్మ ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. కర్నూలులో జి. పుల్లారెడ్డి సేవలను ఆదర్శంగా తీసుకుని ఆయన వీహెచ్పీలో అనేక కార్యక్రమాలు చేపట్టారు.