అంబటి కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఎల్లుండి తీర్పు
ABN , Publish Date - Feb 07 , 2026 | 06:11 AM
సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్టయి రాజమండ్రి జైల్లో ఉన్న వైసీపీ నేత అంబటి రాంబాబుకు సంబంధించిన కస్టడీ, బెయిల్ పిటిషన్లపై సోమవారం తీర్పు వెలువడనుంది.
గుంటూరు(లీగల్), ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్టయి రాజమండ్రి జైల్లో ఉన్న వైసీపీ నేత అంబటి రాంబాబుకు సంబంధించిన కస్టడీ, బెయిల్ పిటిషన్లపై సోమవారం తీర్పు వెలువడనుంది. ఈ రెండు పిటిషన్లపై శుక్రవారం గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టులో మేజిస్ట్రేట్ స్రవంతి సమక్షంలో ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రాసిక్యూషన్ తరఫున డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి, స్పెషల్ పీపీ జగదీశ్, మొబైల్ కోర్టు ఏపీపీ శౌరి.. అంబటి తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, పక్కాల సూరిబాబుతో పాటు పలువురు వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు హాజరయ్యారు. ఉద్దేశపూర్వకంగానే అంబటి ముఖ్యమంత్రిని దూషించి, వర్గ విభేదాలు, సమాజంలో శాంతి భద్రతల సమస్య సృష్టించారని దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని పీపీలు వాదించారు. కేసు దర్యాప్తు తొలి దశలోనే ఉందని ఈ సమయంలో బెయిల్ మంజూరు చేేస్త సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. పోలీస్ కస్టడీ అవసరం లేదని, అంబటికి తక్షణం బెయిల్ మంజూరు చేయాలని పొన్నవోలు కోరారు.