వెలిగొండ, పోలవరం ఎడమ కాలువ పనులను సకాలంలో పూర్తి చేయాలి
ABN , Publish Date - May 30 , 2026 | 05:17 AM
వెలిగొండ, పోలవరం ఎడమ ప్రధాన కాలువలను త్వరితగతిన పూర్తి చేసేలా కార్యాచరణను అమలు చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.
అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి నిమ్మల
అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): వెలిగొండ, పోలవరం ఎడమ ప్రధాన కాలువలను త్వరితగతిన పూర్తి చేసేలా కార్యాచరణను అమలు చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులపై ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్సును నిర్వహించారు. సమావేశంలో జల వనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు ఈఎన్సీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్, వింగ్స్, రిటర్న్స్ పనులు పూర్తయ్యాయని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. అప్రోచ్ చానల్తో పాటు, టన్నెల్-1 మడ్ తొలగింపు పనులు జరుగుతున్నాయన్నారు. టన్నెల్-2లో సంక్లిష్టమైన బెంచింగ్ పనులు జూన్ 10 నాటికి పూర్తికావాలని మంత్రి ఆదేశించారు. మిగిలిన 1.7 కిలోమీటర్ల లైనింగ్ పనులు జూలై చివరి నాటికి పూర్తి చేయాలన్నారు. పోలవరం ఎడమ కాలువ పనుల్లో భాగంగా జాతీయ రహదారుల క్రాసింగ్స్ దగ్గర వంతెనల నిర్మాణ పనలు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఆగస్టులో కాలువను సీఎం చంద్రబాబు ప్రారంభించడానికి అనువుగా అనకాపల్లి వరకూ పనులు పూర్తి చేయాలన్నారు.