వీబీజీరామ్జీ డీబీటీ నిబంధనల్లో మినహాయింపులు
ABN , Publish Date - Aug 09 , 2026 | 05:17 AM
సాంకేతిక కారణాల వల్ల నిజమైన లబ్ధిదారులు వీబీజీరామ్జీ పథకం ప్రయోజనాలకు దూరం కాకూడదన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ)కి కొన్ని మినహాయింపులు..
అమరావతి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): సాంకేతిక కారణాల వల్ల నిజమైన లబ్ధిదారులు వీబీజీరామ్జీ పథకం ప్రయోజనాలకు దూరం కాకూడదన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ)కి కొన్ని మినహాయింపులు కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 7వ తేదీ నుంచి ఈ కొత్త నియమాలు అమల్లోకి వచ్చినట్లు అందులో పేర్కొంది. 18 ఏళ్లకు పైబడిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులని వెల్లడించింది. ప్రతి గ్రామీణ కుటుంబంలోని వయోజన సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 125 రోజుల వేతన ఉపాధిని కల్పించడానికి ఈ పథకం చట్టబద్ధమైన హామీనిస్తోంది. ఈ పథకం కింద సబ్సిడీలు, ప్రయోజనాలు, సేవలు పొందడానికి లబ్ధిదారులు తమ ఆధార్ సంఖ్య ద్వారా ప్రమాణీకరణ(అథెంటికేషన్) చేసుకోవాలి. లేదా ఆధార్ కార్డు ఉన్నట్లు నిరూపించుకోవాలి. నకిలీలను అరికట్టడానికి, లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనాలు అందించడానికి, వ్యవస్థలో పారదర్శకతను పెంచడానికి ఆధార్ను అనుసంధానిస్తున్నారు. లబ్ధిదారుకుఆధార్ కార్డు లేనిపక్షంలో ముందుగా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. వేలిముద్రలు సరిపోలకపోవడం, ముఖ గుర్తింపు లేదా ఐరిస్ స్కాన్ సరిగ్గా పనిచేయని సందర్భాల్లో.. ఓటీపీ అథెంటికేషన్: వీలైన చోట వన్ టైమ్ పాస్వర్డ్ ద్వారా అవకాశం కల్పిస్తారు. ఆధార్ క్యూఆర్: బయోమెట్రిక్, ఓటీపీ విధానం విఫలమైనప్పుడు ఆధార్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ప్రయోజనాలు అందిస్తారు.