CISF DIG Dr. MG Raghavendra Kumar: 28 నుంచి ‘వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్’
ABN , Publish Date - Jan 20 , 2026 | 05:22 AM
వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) ఈ నెల 28 నుంచి ‘వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్-2026’ నిర్వహించనుందని...
తీర ప్రాంతంలో 6,553 కి.మీ.సైకిల్ యాత్ర
ఫిబ్రవరి 6న విశాఖపట్నం చేరనున్న యాత్ర
విశాఖపట్నం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) ఈ నెల 28 నుంచి ‘వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్-2026’ నిర్వహించనుందని విశాఖపట్నం సీఐఎస్ఎఫ్ డీఐజీ డాక్టర్ ఎంజీ రాఘవేంద్రకుమార్ తెలిపారు. పోర్టు గెస్ట్హౌ్సలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీనియర్ కమాండెంట్ సతీశ్కుమార్ బాజ్పాయి, కమాండెంట్ జితేంద్రబాబుతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. ‘సురక్షిత తీరాలు... సమృద్ధ భారత్’ నినాదంతో చేపట్టే సైక్లింగ్ యాత్ర దేశంలోని తొమ్మిది తీర ప్రాంత రాష్ట్రాల్లో 6,553 కి.మీ. పొడవున 25 రోజులపాటు సాగుతుందని చెప్పారు. ఈ యాత్ర ఆంధ్రప్రదేశ్లో 8 రోజుల పాటు 964 కి.మీ. మేర సాగుతుందన్నారు. ఈ నెల 28న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి నిత్యానందరాయ్ ప్రారంభించే ఈ యాత్ర ఫిబ్రవరి 6న విశాఖపట్నం చేరుతుందన్నారు. 7న ఆర్కే బీచ్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ యాత్ర ఫిబ్రవరి 22ను ముగుస్తుందని, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. యాత్రలో 130 మంది సీఐఎ్సఎఫ్ సిబ్బంది పాల్గొంటారని, అందులో 65 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారని తెలిపారు.