పట్టణాభివృద్ధికి యూకే సహకారం
ABN , Publish Date - May 22 , 2026 | 04:55 AM
పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ, ఆధునిక రవాణా వ్యవస్థల అభివృద్ధి లక్ష్యంగా యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రతినిధి బృందంతో రాష్ట్ర అధికారులు గురువారం సమావేశమయ్యారు.
ప్రతినిధి బృందంతో మున్సిపల్ అధికారుల భేటీ
అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ, ఆధునిక రవాణా వ్యవస్థల అభివృద్ధి లక్ష్యంగా యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రతినిధి బృందంతో రాష్ట్ర అధికారులు గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి యూకే డిపార్ట్మెంట్ ఫర్ బిజినెస్ అండ్ ట్రేడ్ ప్రతినిధి చాజ్వాలియా, బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ (హైదరాబాద్) గారెత్ విన్ ఓవెన్, రాష్ట్ర ప్రభుత్వం తరపున మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్కుమార్, సీఆర్డీఏ కమిషనర్, ఏడీసీఎల్, ఏజీఐసీఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు. పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్ రంగాల్లో సహకారం, గ్రీన్ మొబిలిటీ, ఆధునిక పట్టణ రవాణా వ్యవస్థలు, నదీతీర అభివృద్ధి, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణాల్లో ఎనర్జీ ఎఫిషియెన్సీ కోసం డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్స్పై చర్చించారు. పెద్ద ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై విస్తృతంగా చర్చించారు. యూకే ప్రతినిధులు ఎక్స్చేంజ్ ఫైనాన్స్ మోడల్స్, పీపీపీ విధానాల ద్వారా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలను వివరించారు. సుస్థిర పట్టణాభివృద్ధి కోసం ప్రాజెక్టుల పైప్లైన్ను బలోపేతం చేసి, అంతర్జాతీయ పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పర్యాటకం, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ రంగాల్లో సహకరించుకోవాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. చర్చల్లో తీసుకున్న అంశాల అమలుపై త్వరలోనే మరో సమావేశం నిర్వహించనున్నారు.