రిజర్వాయర్లో మునిగి ఇద్దరి మృతి
ABN , Publish Date - May 31 , 2026 | 06:04 AM
అనంతపురం జిల్లా ఉరవకొండ మండల పరిధిలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటిలో మునిగి ఫరీద(35), ఆమె అక్క కూతురు యాస్మిన్(13) మృతిచెందారు.
ఉరవకొండ, మే 30(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా ఉరవకొండ మండల పరిధిలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటిలో మునిగి ఫరీద(35), ఆమె అక్క కూతురు యాస్మిన్(13) మృతిచెందారు. అనంతపురంలోని ఆజాద్ నగర్కు చెందిన కుర్షీద్ బాను, ఫరీద అక్కాచెల్లెళ్లు. బక్రీద్ వేడుకల్లో భాగంగా శనివారం వీరు తమ కుటుంబాలతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. కౌకుంట్ల సమీపంలోని పీఏబీ రిజర్వాయర్ వద్ద విందు భోజనాలను ఏర్పాటు చేసుకున్నారు. భోజనానంతరం ఫరీద, ఆమె అక్క కూతురు యాస్మిన్ సరదగా నీటిలోకి దిగారు. ఈత రాకపోవడం, లోతు గమనించకుండా ముందుకు వెళ్లడంతో పెద్ద గుంతలో ఇద్దరూ మునిగిపోయారు. కుటుంబ సభ్యులు గమనించి, గాలించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సాయంతో మృతదేహాలను వెలికి తీయించారు.