రాజధానిపై వైసీపీది సెల్ఫ్ గోల్
ABN , Publish Date - Apr 09 , 2026 | 05:20 AM
రాజధాని అమరావతి విషయంలో వైసీపీది సెల్ఫ్ గోల్ అని పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.
నేడు మావిగన్ అన్న జగన్...
రేపు ‘శ్రీవిపుల’ అన్నా ఆశ్చర్యం లేదు: తులసిరెడ్డి
కడప కలెక్టరేట్, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి విషయంలో వైసీపీది సెల్ఫ్ గోల్ అని పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘రాజధాని అమరావతి విషయంలో జగన్ పార్టీ గందరగోళంలో, అయోమయంలో ఉంది. 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని జగన్ చెప్పారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర రాజధానిని విశాఖపట్నం మార్చాలని ప్రయత్నించి విఫలమయ్యారు. రాజధాని పేరుతో రాష్ర్టాన్ని మూడు ముక్కలాటలాడి ప్రజలను గందరగోళంలోకి నెట్టారు. తాజాగా మావిగన్ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. రేపు రాజధాని శ్రీవిపుల... శ్రీకాకుళం, విజయవాడ, పులివెందుల అన్నా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే వైసీపీ విధానం ప్రజల్లో నవ్వులపాలయింది.’ అని తులసిరెడ్డి పేర్కొన్నారు.