శ్రీవారి సేవల్లో మోసాలకు చెక్!
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:51 AM
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, గదుల కేటాయింపు సహా దర్శన టికెట్లకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రస్తుతం భక్తుల ఆధార్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటోంది.
నకిలీ ఆధార్లను అరికట్టేలా యూఐడీఏఐతో టీటీడీ చర్చలు
తిరుపతి(టీటీడీ), ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, గదుల కేటాయింపు సహా దర్శన టికెట్లకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రస్తుతం భక్తుల ఆధార్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటోంది. అయితే.. కొందరు ఈ కార్డుల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో ఆధార్ వాస్తవికతను నిర్ధారిస్తే తప్ప.. అవి అసలో.. నకిలీవో.. తెలిసే అవకాశం లేదు. కానీ, ఆధార్ కార్డుల వాస్తవికతను గుర్తించే వ్యవస్థ టీటీడీ వద్ద లేదు. ఈ నేపథ్యంలో ముఖ గుర్తింపు(ఫేస్ రికగ్నిషన్)తోపాటు, ఆధార్ నిర్ధారణ వ్యవస్థలను తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి సం బంధించి యూఐడీఏఐ సేవలు వినియోగించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు యూఐడీఏఐ అధికారులు టీటీడీ యంత్రాంగంతో పలు అంశాలపై చర్చించారు. ఆధార్ సేవలను వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. దీనికిగాను అథెంటికేషన్ యూజర్ ఏజెన్సీ(ఏయూఏ) రిజిస్ర్టేషన్ కోసం రెండేళ్లకు రూ.20 లక్షలు చెల్లించాలని సూచించారు. ఆధార్ నిర్ధారణకు ఒక్కొక్క లావాదేవీకీ 4 పైసలు, ఈకేవైసీకి రూ.3.40 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. యూఐడీఏఐ సేవలు వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సంబంధిత నోటిఫికేషన్ ఇచ్చేలా టీటీడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.