ఆప్కోతో టీటీడీ ఒప్పందం
ABN , Publish Date - Feb 22 , 2026 | 04:37 AM
తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే భక్తులకు వేదాశీర్వచనంలో అందజేసే కండువాలు, దుపట్టాలు, కాటన్ బ్లౌజ్లు, ఇతర వస్త్రాలను సరఫరా చేయడానికి టీటీడీతో ...
కండువాలు, దుశ్శాలువాలు, ఇతర వస్త్రాలకు ఆర్డర్
అమరావతి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే భక్తులకు వేదాశీర్వచనంలో అందజేసే కండువాలు, దుపట్టాలు, కాటన్ బ్లౌజ్లు, ఇతర వస్త్రాలను సరఫరా చేయడానికి టీటీడీతో ఆప్కో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు టీటీడీ మార్కెటింగ్ విభాగం నుంచి ఆర్డర్ వచ్చింది. మొదటి విడతగా 3వేల కండువాలు, 5 వేల దుశ్శాలువాలు, 90 వేల కాటన్ అప్పర్లు, 75వేల కాటన్ బ్లౌజ్లు సరఫరా చేయాలని, వాటిపై ‘ఓం నమో వెంకటేశాయ’ అని తెలుగులో, సంస్కృతంలో ముద్రించాలని ఆర్డర్లో స్పష్టం చేశారు. ఆప్కో చరిత్రలో మొదటిసారి టీటీడీతో ఒప్పందం చేసుకోవడం ఆనందకరమైన విషయమని, ఇది నేతన్నలకు.. ఆ వెంకన్న దీవెనలాంటిదని మంత్రి సవిత శనివారం పేర్కొన్నారు. నేతన్నలకు 365 రోజులూ ఉపాధి, ఆర్థిక భరోసాతో కూడిన జీవనం అందించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యానికనుగుణంగా నిర్ణయం తీసుకున్నారంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, పాలకమండలికి మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు.