Share News

TTD: అలిపిరిలో టౌన్‌షిప్‌.. బోర్డు సమష్టి నిర్ణయమే!

ABN , Publish Date - Jan 14 , 2026 | 05:30 AM

తిరుపతి నగరం అలిపిరిలో టౌన్‌షి్‌ప నిర్మాణం అనేది బోర్డు సభ్యులందరూ చర్చించి తీసుకున్న సమష్టి నిర్ణయమని టీటీడీ స్పష్టం చేసింది.

TTD: అలిపిరిలో టౌన్‌షిప్‌.. బోర్డు సమష్టి నిర్ణయమే!

  • 2018లోనే మాస్టర్‌ ప్లాన్‌ ఆమోదం

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై టీటీడీ వివరణ

  • మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్నది ‘అలిపిరి’ అనే

  • మరి శిల్ప శిక్షణ సంస్థ స్థలమే ఎందుకు?

తిరుపతి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరం అలిపిరిలో టౌన్‌షి్‌ప నిర్మాణం అనేది బోర్డు సభ్యులందరూ చర్చించి తీసుకున్న సమష్టి నిర్ణయమని టీటీడీ స్పష్టం చేసింది. ఈనెల 12వ తేదీ సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘‘ఈ తిరకాసేమిటి తిరుమలేశా?’’ అన్న శీర్షికన ప్రచురితమైన వార్తపై టీటీడీ స్పందించింది. భక్తుల సౌలభ్యం కోసం వారు సులువుగా చేరుకునే అలిపిరి ప్రాంతంలో వసతి సముదాయం ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుందని బోర్డు నిర్ణయించిందని దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. సమష్టిగా తీసుకున్న ఆ నిర్ణయాన్ని టీటీడీ చైర్మన్‌కు ఆపాదించడం సరైంది కాదని తెలిపింది. 2018లోనే అలిపిరి సమీపంలో భక్తుల వసతి సదుపాయాల కోసం శిల్ప శిక్షణా సంస్థ పరిసరాల్లో 38 ఎకరాల్లో నాలుగు బ్లాకులతో కూడిన భవన సముదాయాన్ని నిర్మించాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసిందని తెలిపింది. 2019-24 మధ్య వైసీపీ హయాంలో అలిపిరి కాకుండా ప్రత్యామ్నాయ ప్రాంతంలో స్పిరిచ్యువల్‌ సిటీ ఏర్పాటు కోసం 2021, 2022, 2023లో నాలుగు సార్లు బోర్డు తీర్మానాలు చేసిందని తెలిపింది. అయితే ఆ ఐదేళ్లలో ఈ దిశగా ఎలాంటి అభివృద్ధీ జరగలేదని పేర్కొంది. గతేడాది డిసెంబరు 16న అలిపిరి-చెర్లోపల్లి రోడ్డులో పేరూరు గ్రామ సర్వే నంబరు 604-9లో టీటీడీకి చెందిన 20 ఎకరాల భూమిలో తీర్థ యాత్రికుల టౌన్‌షి్‌ప నిర్మాణానికి డిజైన్లు రూపొందించే ప్రతిపాదన బోర్డు సమావేశంలో చర్చకు వచ్చిందని, దీనిని శిల్ప శిక్షణా సంస్థ, ప్రొడక్షన్‌ సెంటర్‌ ఉన్న ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని తీర్మానించినట్టు తెలిపింది. ప్రస్తుతం శిల్ప శిక్షణాసంస్థను సూచిస్తూ ప్రతిపాదించిన టౌన్‌షి్‌ప ప్రాజెక్టు వాస్తవానికి 2018లో రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌లో భాగమని టీటీడీ తెలిపింది.


తీర్మానంలో ఆ మాటేదీ?

అలిపిరిలో టీటీడీకి ప్రత్యామ్నాయ స్థలాలున్నప్పటికీ... శిల్ప శిక్షణ సంస్థ స్థలాన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నారన్నది ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్న. ప్రతిష్ఠాత్మకమైన ఆ సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. టౌన్‌షిప్‌ నిర్మాణానికి అధికారులు నిర్దిష్టంగా మరో స్థలాన్ని సూచించినప్పటికీ బోర్డు శిల్ప శిక్షణ సంస్థ స్థలాన్నే ఎంపిక చేసుకుంది. దీనికి టీటీడీ సమాధానం ఇవ్వలేదు. 2018లోనే అప్పటి బోర్డు శిల్ప శిక్షణ సంస్థ స్థలంలో టౌన్‌ షిప్‌ నిర్మించేందుకు తీర్మానించినట్లు టీటీడీ చెబుతోంది. అయితే... నాటి తీర్మానం ప్రతిని పరిశీలిస్తే అందులో ఎక్కడా శిల్ప శిక్షణ సంస్థ స్థలంలో టౌన్‌షి్‌ప కట్టాలని ప్రతిపాదనే లేదు. ‘అలిపిరి’లో అని మాత్రమే ఉంది. దీంతో తాజాగా టీటీడీ ఇచ్చిన వివరణ అయోమయానికి గురి చేస్తోంది. ఇక... 2019 జనవరి 8న జరిగిన బోర్డు సమావేశంలో ఒక బ్లాకు నిర్మాణానికి టెండర్లను ఆమోదించారు. ఆ తీర్మానంలో కూడా అలిపిరిలో భక్తులకు వసతి కోసం ఒక బ్లాకు నిర్మాణం అని మాత్రమే ఉంది తప్ప శిల్ప శిక్షణ సంస్థ స్థలంలో నిర్మించాలని ఎక్కడా ప్రస్తావించలేదు. అంతేకాదు... ప్రతిపాదిత నిర్మాణ స్థలంలో చెట్ల నరికివేతకు అటవీ శాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో 2019 అక్టోబరు 23 నాటి బోర్డు సమావేశం సంబంధిత పనులను రద్దు చేస్తూ తీర్మానించింది.

Updated Date - Jan 14 , 2026 | 05:30 AM