Share News

తిరుమల కొండపై రీల్స్‌ రగడ

ABN , Publish Date - Mar 06 , 2026 | 03:31 AM

తిరుమల పేరు వింటేనే ఓ ఆధ్యాత్మిక భావన భక్తుల మదిలో మెదులుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఆ క్షేత్రాన్ని ఇల వైకుంఠంగా భావిస్తారు.

తిరుమల కొండపై రీల్స్‌ రగడ

  • తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా వీడియోలు

  • క్షేత్ర పవిత్రతను దెబ్బతీసేలా చేష్టలు

  • సోషల్‌ మీడియాలో పోస్టులు

  • పట్టించుకోని భద్రతా సిబ్బంది

  • తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్న భక్తులు

  • మరోసారి దివ్వెల మాధురి అత్యుత్సాహం

  • తిరుమలలో కేక్‌ కట్‌ చేయడంపై విమర్శలు

(తిరుమల- ఆంధ్రజ్యోతి)

తిరుమల పేరు వింటేనే ఓ ఆధ్యాత్మిక భావన భక్తుల మదిలో మెదులుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఆ క్షేత్రాన్ని ఇల వైకుంఠంగా భావిస్తారు. అలాంటి క్షేత్ర పవిత్రతకు భంగం వాటిల్లేలా, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కొంతమంది రీల్స్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ పాపులారిటీ కోసం ఇష్టానుసారం వీడియోలు చిత్రీకరిస్తున్నారు. ఇదో దైవక్షేత్రమనే విషయాన్ని కూడా మరిచిపోతున్నారు. ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉంటే చోట ఇలా వీడియోలను చిత్రీకరిస్తుండటం పట్ల భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. తిరుమల క్షేత్ర వైభవాన్ని తప్ప ఇతర వీడియోలను చిత్రీకరించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఇటీవల కొందరు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తున్న వీడియోలు భక్తులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. రెండేళ్ల క్రితం బ్రహ్మోత్సవాల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి ఆలయ మాడవీధులు, పరిసర ప్రాంతాల్లో వీడియోలు చిత్రీకరించడం తీవ్రస్థాయిలో దుమారం రేపింది. ఈ అంశంపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అంతకుముందు ప్రముఖ సినీనటి నయనతార వివాహం చేసుకుని తిరుమలకు వచ్చి ఆలయం ముందే వెడ్డింగ్‌ షూట్‌ నిర్వహించడం కూడా విమర్శలకు దారి తీసింది.

Untitled-2 copy.jpg


బోర్డులో తీర్మానం చేసినా..

తిరుమలలో వెడ్డింగ్‌ షూట్‌లు, సినిమా పాటలకు రీల్స్‌, షార్ట్స్‌ చేయడం, రాజకీయ ప్రసంగాలు చేయడం నిషేధమని, నిబంధనలను అతిక్రమిస్తే కేసులు కూడా పెడతామని టీటీడీ బోర్డు ఇటీవల తీర్మానం చేసింది. అయినప్పటికీ కొందరు యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయన్సర్లు, మరికొంతమంది తమ చేష్టలను ఆపడం లేదు. గతేడాది డిసెంబరులో తమిళనాడు ఏడీఎంకే విద్యార్థి విభాగానికి చెందిన ఇద్దరు యువకులు రాజకీయ నాయకులతో కూడిన ఫ్లెక్సీని ఆలయం ముందు ప్రదర్శించారు. అలాగే తమిళనాడుకు చెందిన మరో జంట కల్యాణవేదికలో పెళ్లి చేసుకుని ఆలయం ముందు వెడ్డింగ్‌ షూట్‌ నిర్వహించడంతో పాటు నుదుటిపై ముద్దులు పెట్టుకోవడం విమర్శలకు దారితీసింది. అంతకుముందు అలిపిరి చెక్‌పాయింట్‌ వద్ద ఓ యువతి సినిమా పాటకు డ్యాన్స్‌ చేయడం కూడా దుమారం రేపింది. ఇటీవల బిగ్‌బాస్‌ షో పోటీదారు గీతూ రాయల్‌ కొంతమంది యువకులతో కలిసి ఆలయం వద్ద, ఘాట్‌ రోడ్డులో సినిమా పాటకు డ్యాన్స్‌ చేసింది. అలాగే మరో ఇద్దరు యువకులు లక్కీడ్రా పేరుతో ఆలయం ముందు చేసిన వీడియో కూడా సంచలనమైంది.


తీరు మార్చుకోని మాధురి

గతంలో ఓసారి పోలీసు కేసు నమోదైనప్పటికీ దివ్వెల మాధురి తీరు మారలేదు. గురువారం బిగ్‌బాస్‌ షో పోటీదారు తనూజ పుట్టినరోజు సందర్భంగా కేక్‌ కట్‌చేసి మాధురి సెలబ్రేట్‌ చేశారు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. తిరుమలకు బర్త్‌డే కేకులు తీసుకురావడం నిషేధం. పటిష్ఠమైన సెక్యూరిటీ ఉండగా మాధురి కేక్‌ను ఎలా తీసుకొచ్చారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఘటన జరిగిన తర్వాత కేసులు పెట్టడం, మైకుల్లో ప్రకటనలు చేయడం, ఫ్లెక్సీలు పెట్టడం తప్ప ప్రత్యేకమైన నిఘా అంటూ లేకపోవడంతో తిరుమలలో రీల్స్‌ చేసేవారు పెరుగుతూనే ఉన్నారు. తిరుమల పవిత్రతను కాపాడడంలో భాగంగా ఇకనైనా ప్రత్యేక సిబ్బంది లేదా సేవకులను నియమించి ఇలాంటి వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

Untitled-2 copy.jpg

Updated Date - Mar 06 , 2026 | 03:37 AM