శ్రీవాణి టికెట్ల కరెంట్ బుకింగ్లో కీలక మార్పులు
ABN , Publish Date - Mar 28 , 2026 | 05:01 AM
శ్రీవాణి ట్రస్టు దాతలు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్పెట్టేలా టీటీడీ కీలక మార్పులు చేపట్టింది. ఒకేసారి విరాళం ఇవ్వడంతోపాటు టికెట్లకు పేమెంట్ చేసి బుక్ చేసుకునేలా...
ఒకేసారి విరాళం, దర్శనం బుక్ చేసుకునేందుకు అవకాశం
తిరుమల, మార్చి 27(ఆంధ్రజ్యోతి): శ్రీవాణి ట్రస్టు దాతలు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్పెట్టేలా టీటీడీ కీలక మార్పులు చేపట్టింది. ఒకేసారి విరాళం ఇవ్వడంతోపాటు టికెట్లకు పేమెంట్ చేసి బుక్ చేసుకునేలా నూతన విధానాన్ని శుక్రవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రతిరోజూ తిరుపతి ఎయిర్పోర్టులో 200 శ్రీవాణి టికెట్లు జారీ చేయడంతోపాటు కరెంట్ బుకింగ్ కోటా కింద ఉదయం 9 గంటలకు 800 టికెట్లను ఆన్లైన్లో జారీ చేస్తున్నారు. అయితే రూ.10వేలు విరాళం కట్టి, మరోసారి టికెట్ కోసం లాగిన్ అయ్యేలోపే 800 టికెట్ల కోటా పూర్తవుతోంది. దీంతో ట్రస్టుకు విరాళం ఇచ్చిన దాతలు దర్శన టికెట్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలకు చెక్పెట్టేలా యూనియన్ బ్యాంక్ సహకారంతో ఏకకాలంలో విరాళం కట్టడంతోపాటు టికెట్ ధరను చెల్లించి, టికెట్లు పొందేలా సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం వన్ ప్లస్ త్రీ వరకు ఈ టికెట్లను పొందే అవకాశం ఉంది. ఉదాహరణకు నలుగురి పేర్లను నమోదు చేస్తే విరాళం, టికెట్తో కలిపి రూ.42 వేలకు పేమెంట్ చూపిస్తుంది. దీన్ని క్రెడిట్, డెబిట్, యూపీఐ, నెట్బ్యాంకింగ్ ద్వారా చెల్లించి టికెట్లు పొందవచ్చు. ఒక ఐడీపై ఓసారి టికెట్లు పొందితే తిరిగి వారం పాటు బుకింగ్కు అవకాశం ఉండదు. ఇప్పటికే ట్రస్టుకు విరాళం ఇచ్చిన దాతల కోసం ‘ఫ్యూచర్ ’ అనే ఆప్షన్ ద్వారా దర్శన టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.