కిటకిటలాడుతున్న తిరుమల!
ABN , Publish Date - Jun 14 , 2026 | 05:24 AM
తిరుమలలో శనివారం భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు అన్ని ప్రాంతాలూ రద్దీగా కనిపిస్తున్నాయి.
తిరుమల, జూన్ 13(ఆంధ్రజ్యోతి): తిరుమలలో శనివారం భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు అన్ని ప్రాంతాలూ రద్దీగా కనిపిస్తున్నాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయారు. క్యూలైన్ రింగురోడ్డులోని శిలాతోరణం సర్కిల్ మీదుగా ఆక్టోపస్ భవనం సర్కిల్ వరకు దాదాపు నాలుగు కిలోమీటర్ల మేరకు వ్యాపించింది. వీరికి దాదాపు 18 గంటల దర్శన సమయం పడుతోంది. తిరుమలలో గదులకూ డిమాండ్ కొనసాగుతోంది. తలనీలాలు సమర్పించే కల్యాణ కట్టలు, గదులు పొందే రిసెప్షన్ కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి. మరోవైపు అలిపిరి తనిఖీ కేంద్రం శనివారం వాహనాల రద్దీతో కిటకిలాడింది. సాయంత్రం 6 గంటల సమయానికి 10,540 వాహనాలు తిరుమలకు చేరుకున్నాయి.