తిరుమల నిత్యాన్నదాన పథకానికి 41 ఏళ్లు
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:35 AM
తిరుమల నిత్యాన్నదాన పథకం 41 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పథకానికి సహకరిస్తున్న దాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు.
సహకరిస్తున్న దాతలకు సీఎం అభినందనలు
అమరావతి, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): తిరుమల నిత్యాన్నదాన పథకం 41 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పథకానికి సహకరిస్తున్న దాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈమేరకు సీఎం ఎక్స్లో పోస్టు చేశారు. ‘కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధిలో 1985 ఏప్రిల్ 6న ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ప్రవేశపెట్టిన నిత్యాన్నదాన పథకం.. అన్నదాన సేవ మరో ఏడాది పూర్తి చేసుకుంది. కేవలం 2 వేల మందికి అన్న వితరణతో ప్రారంభమైన ఈ గొప్ప కార్యక్రమం నేడు రోజుకి 2.80 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే స్థాయికి చేరింది. భక్తుల భాగస్వామ్యం, సహకారంతో శ్రీవెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ మూల నిధి ప్రస్తుతం రూ.2500 కోట్లు దాటింది. అన్నదాన పథకం నుంచి స్ఫూర్తి పొంది ప్రాణదానం ట్రస్ట్, విద్యాదానం ట్రస్ట్లు ఏర్పాటు చేసి టీటీడీ ద్వారా వైద్య, విద్యా సేవలను అందిస్తున్నాం. నిత్యాన్నదానం పథకానికి సహకరిస్తున్న దాతలకు నా అభినందనలు’ అని సీఎం పేర్కొన్నారు.