కల్తీ సహజమే: సజ్జల
ABN , Publish Date - Jan 31 , 2026 | 05:39 AM
తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీ జరిగిందని సిట్ నివేదికలో చెప్పినా, జంతువుల కొవ్వు లేదని చార్జ్జిషీట్లో స్పష్టంగా పేర్కొన్నారని, కల్తీ జరగడం సహజమేనని వైసీపీ రాజకీయ సలహా కమిటీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి .....
అమరావతి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీ జరిగిందని సిట్ నివేదికలో చెప్పినా, జంతువుల కొవ్వు లేదని చార్జ్జిషీట్లో స్పష్టంగా పేర్కొన్నారని, కల్తీ జరగడం సహజమేనని వైసీపీ రాజకీయ సలహా కమిటీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తిరుమల లడ్డూలో జంతు వ్యర్థాలు లేవని తేలినందున భక్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు శుక్రవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నెయ్యిలో కల్తీ ఉందంటూ ల్యాబొరేటరీలు చెప్పినా, అందులో జంతు కొవ్వు అవశేషాలు లేవని తేలింది. నెయ్యిలో జంతు కొవ్వులేదని సిట్ తేల్చి చెప్పింది. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు ఉందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏకంగా పంది కొవ్వును వాడారని చెబుతూ భక్తుల మనోభావాలను మరింత దెబ్బతీశారు. తాను తప్పుగా మాట్లాడానని చంద్రబాబు క్షమాపణ చెప్పే దాకా భక్తులు ఒత్తిడి చేయాల’ంటూ సజ్జల పిలుపునిచ్చారు.