Share News

Atreyapuram: హైలెస్సొ..హైలెస్సా...

ABN , Publish Date - Jan 13 , 2026 | 07:17 AM

సర్‌ఆర్ధర్‌ కాటన్‌ గోదావరి ట్రోఫీ ఆత్రేయపురం ఉత్సవ్‌, రాష్ట్ర పర్యాటక శాఖ సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న జాతీయస్థాయి డ్రాగన్‌ పడవ పోటీలు సోమవారం ఉత్సాహభరితంగా సాగాయి.

Atreyapuram: హైలెస్సొ..హైలెస్సా...

  • ఆత్రేయపురంలో హోరాహోరీగా డ్రాగన్‌ పడవ పోటీలు

ఆత్రేయపురం, జనవరి 12(ఆంధ్రజ్యోతి): సర్‌ఆర్ధర్‌ కాటన్‌ గోదావరి ట్రోఫీ ఆత్రేయపురం ఉత్సవ్‌, రాష్ట్ర పర్యాటక శాఖ సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న జాతీయస్థాయి డ్రాగన్‌ పడవ పోటీలు సోమవారం ఉత్సాహభరితంగా సాగాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం-తాడిపూడి వంతెన నుంచి ఉచ్చిలి వరకూ సెంట్రల్‌ డెల్టా ప్రధాన కాలువలో కిలోమీటరు పరిధిలో ఈ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి మొత్తం 22 టీమ్‌లు పాల్గొన్నాయి. వీటిలో 12 టీమ్‌లు క్వార్టర్‌ ఫైనల్స్‌కు, ఆ తర్వాత 6 టీమ్‌లు సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. మంగళవారం జరిగే సెమీఫైనల్స్‌లో బండారు టీమ్‌, కోనసీమ టీమ్‌, పల్నాడు టీమ్‌, కర్నూలు టీమ్‌, అలెప్పి(కేరళ) టీమ్‌, ఎర్రకాలువ టీమ్‌లు సెమీఫైనల్స్‌లో తలపడనున్నాయి. ఇందులో ప్రథమ విజేతకు రూ.2లక్షలు, ద్వితీయ విజేతకు రూ.లక్ష, తృతీయ రూ.50వేల నగదుతోపాటు, ట్రోఫీలతో సత్కరించనున్నారు. పోటీలను తిలకించేందుకు వేలాదిమంది తరలివచ్చారు. మంగళవారం ముగింపు సభలో మంత్రులు వంగలపూడి అనిత, కె.అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్‌, వాసంశెట్టి సుభాష్‌ విజేతలకు బహుమతులు అందజేస్తారు. తొలుత ఈ పోటీలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జెండా ఊపి ప్రారంభించారు. పడవ పోటీల నిర్వహణ మధ్యలో స్కై బోటుపై ఓ యువకుడి విన్యాసం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది.

Updated Date - Jan 13 , 2026 | 07:18 AM