నీటికుంటలో మునిగి ముగ్గురు బాలురు మృతి
ABN , Publish Date - May 28 , 2026 | 05:30 AM
ఈత కోసం నీటి కుంటలో దిగిన ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలం నారనాగేల్లిలో బుధవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
రొద్దం, మే 27(ఆంధ్రజ్యోతి): ఈత కోసం నీటి కుంటలో దిగిన ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలం నారనాగేల్లిలో బుధవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్ని, సుదర్శన్ రెడ్డి దంపతుల కుమారుడు రాయల్ సుగుణా రెడ్డి(13).., కల్పన, అజయ్ రెడ్డి దంపతుల కుమారులు దరహాస్ రెడ్డి(12), విష్ణురెడ్డి(10) స్వగ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. తమ పొలంలో నేరేడు పండ్లు ఉన్నాయని, వెళ్లి తిందామని సుగుణా రెడ్డి అనండంతో అన్నదమ్ములు దరహాస్, విష్ణు వెంట వెళ్లారు. మధ్యాహ్నం వరకూ నేరేడు పండ్లు తింటూ సరదాగా గడిపారు. అనంతరం ఈత కొట్టేందుకు సమీపంలో ఉన్న నీటి కుంటలోకి దిగారు. ఈత రాకపోవడం, నీటి లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోయి మృతిచెందారు. పక్క పొలంలో పనిచేసే పంజాబ్ కూలీలు కాసేపటి తరువాత అటు వచ్చి, చిన్నారుల దుస్తులు నీటి కుంట బయట ఉండటంతో అనుమానంతో నీటిలో దిగి గాలించారు. దీంతో ముగ్గురు బాలుర మృతదేహాలు లభ్యమయ్యాయి. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.