డిజిటల్ అరెస్టు పేరిట టోకరా
ABN , Publish Date - Mar 13 , 2026 | 05:07 AM
పార్వతీపురం మన్యం జిల్లా పంచాయతీ అధికారిని డిజిటల్ అరెస్టు పేరిట బెదిరించి రూ.59 లక్షలు వసూలు చేసిన ముగ్గురిని గురువారం అనకాపల్లి జిల్లా చోడవరం పోలీసులు అరెస్టు చేశారు.
‘మన్యం’ పంచాయతీ అధికారిని బెదిరించి రూ.59లక్షలు వసూలు చేసిన కేటుగాళ్లు
విశాఖకు చెందిన ముగ్గురి అరెస్టు
చోడవరం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా పంచాయతీ అధికారిని డిజిటల్ అరెస్టు పేరిట బెదిరించి రూ.59 లక్షలు వసూలు చేసిన ముగ్గురిని గురువారం అనకాపల్లి జిల్లా చోడవరం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ బి.అప్పలరాజు కథనం మేరకు.. మన్యం జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న తమర్భ కొండలరావు స్థానిక ప్రభుత్వ హైస్కూల్ సమీపంలో నివాసం ఉంటున్నారు. నెల రోజుల క్రితం ఆయన్ను కొందరు డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి విడతల వారీగా రూ.59 లక్షలు వసూలు చేశారు. దీనిపై బాధితుడు 15రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు చేపట్టారు. విశాఖపట్నం ఊర్వశి జంక్షన్ ప్రాంతానికి చెందిన సదాశివుని వెంకట శివరమాకాంత్, లంపిముఖి మణికంఠేశ్వరరావు, ఇల్లపు హేమసంతోష్లను నిందితులుగా గుర్తించారు. వారిని అరెస్టుచేసి రిమాండ్కు తరలించామన్నారు. కాగా, ఈ డిజిటల్ మోసం వ్యవహారంలో మరికొందరి ప్రమేయం కూడా ఉన్నట్టు తెలుస్తోందని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.