కైలాసవాహనంపై ఆదిదంపతులు
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:24 PM
శ్రీగిరి క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడవరోజైన బుధవారం ఉదయం స్వామివారి యాగశాలలో చండీశ్వరునికి షోడశోపచార పూజా క్రతువులు శాస్త్రోక్తంగా జరిపించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు
శ్రీగిరిలో బ్రహ్మోత్సవ సందడి
శ్రీశైలం, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): శ్రీగిరి క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడవరోజైన బుధవారం ఉదయం స్వామివారి యాగశాలలో చండీశ్వరునికి షోడశోపచార పూజా క్రతువులు శాస్త్రోక్తంగా జరిపించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. సాయంత్రం అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై శ్రీభ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను కైలాస వాహనంపై అధిష్టింపజేసి విశేష పూజలు, మంగళ హారతులు జరిపించారు. గంగాధర మండపం నుంచి నందిమండపం మీదుగా క్షేత్రపాలకుడు బయలు వీరభద్రస్వామి ఆలయానికి చేరుకుని నీరాజనాలు సమర్పించారు. గ్రామోత్సవంలో వివిధ ప్రాంతాలకు చెందిన కోలాటం, కళారూపాలు, చెంచుల డప్పు నృత్యాలతో సందడి చేశారు. ఆలయ ట్రస్ట్బోర్డు సభ్యులు ఏవీ రమణ, దేవకీ వెంకటేశ్వర్లు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీనివాసులు, ఈఈ నర్సింహరెడ్డి, పీఆర్వో శ్రీనివాసరావు, ఏఈవోలు వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.
నేడు నంది వాహన సేవలో...
బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం స్వామిఅమ్మవార్లు నందివాహనసేవలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సంక్రాంతి పర్వదిన సందర్బంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయాధికారులు వెల్లడించారు.
ముగ్గుల పోటీలకు సర్వం సిద్దం
గంగాధర మండపం వద్ద మహిళలకు ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. సంప్రదాయ రంగులతో ముగ్గులు వేసిన వారికి ప్రత్యేక బహుమతులు ప్రకటించనున్నట్లు చెప్పారు.