టెట్ మినహాయింపుపై చొరవ తీసుకోండి
ABN , Publish Date - Jul 10 , 2026 | 04:31 AM
దేశవ్యాప్తంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయు లకు టెట్ మినహాయింపుపై చొరవ తీసుకోవాలని పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడుకి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ..
కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడుకు ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు విజ్ఞప్తి
న్యూఢిల్లీ, జూలై 9(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయు లకు టెట్ మినహాయింపుపై చొరవ తీసుకోవాలని పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడుకి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివా సులు నాయుడు విజ్ఞప్తి చేశారు. టెట్ నిబంధనల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడుకి ఎమ్మెల్సీ గురువారం వినతిపత్రం అందించారు. గతంలో రెండు సార్లు కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ను కలిసి టెట్ సమస్యను ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యాయుల ఆందోళనను తొలగించే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టంచేశారు. రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు అంశంపై చర్చ చేపట్టాలని, విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని కోరారు. కేవలం భవిష్యత్తు కోసమే కాకుండా, ఇప్పటికే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులందరికీ రెట్రోస్పెక్టివ్ పద్థతిలో మినహాయింపు లభించేలా చట్ట సవరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలపై కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు సానుకూలంగా స్పందించారని, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రదాన్ దృష్టికి తీసుకెళ్లి టెట్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు చెప్పారు.