పోలీసు నీడలో ఆకివీడు
ABN , Publish Date - Mar 29 , 2026 | 05:53 AM
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో ఉద్రిక్తతల నేపథ్యంలో అడుగడుగునా సాయుధ పోలీసులు పహారా కాస్తున్నారు.
21 మంది అరెస్టు.. రిమాండ్
ఆకివీడు/ఆకివీడు రూరల్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో ఉద్రిక్తతల నేపథ్యంలో అడుగడుగునా సాయుధ పోలీసులు పహారా కాస్తున్నారు. 50 మీటర్లకు ఒక పికెట్ ఏర్పాటు చేశారు. అక్కడ 144 సెక్షన్ విధించారు. శిథిలావస్థకు చేరిన రామాలయం పరిసరాలకు ఎవరూ వెళ్లకుండా పరదాలు కట్టారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు శ్రీరామనవమి సందర్భంగా పెదపేటలోని ఆలయంలోకి వెళ్లి రాముడి విగ్రహానికి పూలమాల వేయడానికి వీలు లేదంటూ దళితుల పేరిట క్రైస్తవులు పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. రఘురామపై దాడికి యత్నించడంతో పాటు జనసేన నాయకులపై మేకులు, కత్తులతో దాడి చేశారు. అల్లర్లకు కారణమైన 57 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి 21 మందిని అరెస్టు చేశారు. శనివారం భీమవరం కోర్టుకు వారిని హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించింది. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.