దేవాలయాలు పెరిగినంతగా.. ధర్మం పెరగలేదు
ABN , Publish Date - Mar 15 , 2026 | 03:56 AM
‘‘మా చిన్నప్పటి కంటే అధిక సంఖ్యలో దేవాలయాలు పెరిగాయి. భక్తులు గుడులకు వెళ్తున్నారు. తీర్థయాత్రలు చేస్తున్నారు.
అప్పట్లో గుడులు తక్కువున్నా మానవత్వం విరాజిల్లేది: జస్టిస్ ఎన్వీ రమణ
గుంటూరు(తూర్పు), మార్చి 14(ఆంధ్రజ్యోతి): ‘‘మా చిన్నప్పటి కంటే అధిక సంఖ్యలో దేవాలయాలు పెరిగాయి. భక్తులు గుడులకు వెళ్తున్నారు. తీర్థయాత్రలు చేస్తున్నారు. అయినప్పటికీ సమాజంలో అశాంతి, అభద్రత, అరాచకం పెరిగిపోయాయి’’ అని విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వధర్మ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ధర్మజ్యోతి-2026’ పురస్కార ప్రదానోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ అప్పట్లో విరాజిల్లిన మానవత్వం పునర్నిర్మాణం జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ధర్మాన్ని, న్యాయాన్ని, విలువలను, మానవ సంబంధాలను పెంపొందించాలని కోరారు. పిల్లలు తెలుగులో మాట్లాడంతో పాటు, తెలుగు పుస్తకాలు చదివే విధంగా ప్రోత్సహించాలని సూచించారు.