వేసవితో జాగ్రత్త!
ABN , Publish Date - Apr 02 , 2026 | 04:05 AM
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. ఉద యం నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తుండ గా, మధ్యాహ్న సమయంలో బయటకెళ్తే చెమటలు పడుతున్నాయి.
ఎండ తీవ్రత, వడగాడ్పులతో ముప్పు
అమరావతి/విశాఖపట్నం, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. ఉద యం నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తుండ గా, మధ్యాహ్న సమయంలో బయటకెళ్తే చెమటలు పడుతున్నాయి. ఇప్పటికే గరిష్ఠ ఉష్ణోగ్రత 42.5 డిగ్రీలు నమోదవుతుండగా.. మండుతున్న ఎండలకు జనం బయటకెళ్లడానికి భయపడుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. ఎండలకు వడగాడ్పులు తోడు కానున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎండ తీవ్రత, వడగాడ్పులపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరిస్తోంది. తాడేపల్లిలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెం టర్ నుంచి ఉష్ణోగ్రతలు, వడగాడ్పులపై అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎండల సమాచా రం కోసం 24/7 ఉండేలా స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101ను సంప్రదించాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ కోరారు.
పశువులను కాపాడుకోండిలా..!
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బతో పశువుల ఆరోగ్యం దెబ్బతినకుం డా పశుపోషకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్నాయుడు సూచించారు. వేసవిలో పశువు లు ఎక్కువ నీరు తాగుతాయి కాబట్టి రోజూ తెల్లవారుజామునే తొట్టెల్లో నీరు నింపాలి. పశువుల పాకల పైకప్పు తరచూ నీటితో తడుపుతూ చల్లగా ఉండేలా చూడాలి. దా ణాలో ఖనిజ లవణ మిశ్రమాలు 30-50 గ్రాములు ఉండేలా చూడాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ..
ఇంటి వాతావరణం చల్లగా ఉండేందుకు పైకప్పులపై వైట్ పెయింట్, కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్, థర్మాకోల్ ఇన్సులేషన్, ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవాలి.
తెలుపు వస్త్రాలు ధరించడం, కర్చీఫ్, టోపీలు పెట్టుకోవడం, కళ్ల రక్షణకు సన్ గ్లాసెస్, కూల్ గ్లాసెస్ వాడాలి.
గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఇళ్లల్లోనే ఉండాలి. వాహనదారులు హెల్మెట్ ధరించాలి.
శరీరం డీ హైడ్రేషన్ కాకుండా ఓఆర్ఎస్ తాగాలి. శీతలపానీయాలైన లస్సీ, మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు, కొబ్బరినీళ్లు వంటివి సేవించాలి. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి.
నేడు ఉత్తరాంధ్రలో వడగాడ్పులు
రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు
కోస్తా, రాయలసీమల్లో వాతావరణ అనిశ్చితి కొనసాగుతోంది. ఒకవైపు ఎండ తీవ్ర త కొనసాగుతుండగా, మరోవైపు సముద్రం నుంచి తేమగాలులు వీస్తున్నాయి. దీంతో బుధవారం ఉత్తరకోస్తాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. కోస్తాలో మిగిలిన ప్రాంతాలు, సీమలో పొడి వాతావరణం నెలకొంది. గురువారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాడ్పులు,సీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోద య్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహ ణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లోని 8 మండలాల్లో తీవ్రంగా, విజయనగరం, మ న్యం, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని 17 మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని తెలిపింది. బుధవారం సాధారణం కంటే 2, 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.