వేసవి సెలవుల్లో టీచర్ల బదిలీలు
ABN , Publish Date - Jan 24 , 2026 | 05:52 AM
ఉపాధ్యాయ బదిలీల చట్టాన్ని అనుసరించి వేసవి సెలవులు ఇచ్చే ఏప్రిల్, మే నెలల్లో బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ భేటీ
అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ బదిలీల చట్టాన్ని అనుసరించి వేసవి సెలవులు ఇచ్చే ఏప్రిల్, మే నెలల్లో బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం మంగళగిరిలోని విద్యాభవన్లో ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. హైస్కూల్ ప్లస్ల్లోని ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. వేసవి సెలవుల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులపై త్వరలో ఉత్తర్వులు జారీ అవుతాయని చెప్పారు. రెగ్యులర్ పోస్టుల ఖాళీలు ఏర్పడేవరకూ క్లస్టర్ టీచర్లు అక్కడే కొనసాగుతారని, వారికి పాత స్టేషన్ పాయింట్లే వస్తాయని స్పష్టం చేశారు. బదిలీ పాయింట్లలో డెసిమల్స్ స్థాయిలో పాయింట్లు కేటాయిస్తామన్నారు. ఇకనుంచి ప్రతివారం ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. టీచర్లకు పే ప్రొటెక్షన్ ఉత్తర్వులు ఇటీవల విడుదల చేశామని తెలిపారు. ఎస్జీటీలకు 30:70 నిష్పత్తిలో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ పదోన్నతులు ఉంటాయని వెల్లడించారు.