నేటి నుంచి టీడీపీ వర్చువల్ మహానాడు
ABN , Publish Date - May 27 , 2026 | 04:44 AM
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు బుధవారం నుంచి ప్రారంభం కానుంది.
నేటి నుంచి టీడీపీ వర్చువల్ మహానాడు
తెలంగాణ నుంచి నాలుగు తీర్మానాలు
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు బుధవారం నుంచి ప్రారంభం కానుంది. రెండురోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ఈసారి హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం, ఎన్టీఆర్ భవన్తో పాటు మరో 14 కేంద్రాల్లో భారీ స్ర్కీన్లను ఏర్పాటు చేసి ఈ వర్చువల్ మహానాడును అనుసంధానించనున్నట్లు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి తెలిపారు. మహబూబ్నగర్, పెద్దపల్లి, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ, నాగర్కర్నూలు, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఈ కేంద్రాలు ఉంటాయని చెప్పారు. ప్రతీ కేంద్రంలో కూడా పండుగ వాతావరణంలో, నిజమైన మహానాడును తలపించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మహానాడు వేదికగా తెలంగాణ తరపున.. వ్యవసాయం- నీటిపారుదల రంగం, కాంగ్రెస్ హామీలు- అమలులో వైఫల్యం, భూభారతిలో లోపాలు, విద్య- వైద్యంపై నాలుగు తీర్మానాలు ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు ఉమ్మడి జాబితాలో మరో రెండు తీర్మానాలపై రాష్ట్ర పార్టీ ముఖ్యులకు ప్రసంగించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.