హోం మంత్రికి వైసీపీ క్షమాపణలు చెప్పాలి: పల్లా
ABN , Publish Date - Jun 16 , 2026 | 04:19 AM
మహిళల పట్ల గౌరవం లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు. హోం మంత్రి వంగలపూడి అనితకు వైసీపీ క్షమాపణలు చెప్పాలి’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు .....
అమరావతి, గాజువాక(విశాఖపట్నం), అమలాపురం, జూన్ 15(ఆంధ్రజ్యోతి): ‘మహిళల పట్ల గౌరవం లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు. హోం మంత్రి వంగలపూడి అనితకు వైసీపీ క్షమాపణలు చెప్పాలి’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గాజువాకలో డిమాండ్ చేశారు. ‘హోం మంత్రి అనితపై మాజీ మంత్రి అమర్నాథ్ అనుచిత వాఖ్యలు చేయడం దారుణం. తక్షణమే క్షమాపణలు చెప్పి, వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై ప్రశ్నించాలి. అంతేతప్ప దుర్మార్గపు వాఖ్యలు, అసభ్య పదజాలం వాడితే వైసీపీ నేతలకు పుట్టగతులుండవు’ అని పల్లా అన్నారు.
ఆ వ్యాఖ్యలు మహిళలను అవమానించడమే: పీతల సుజాత
‘‘హోం మంత్రి అనితపై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరం. అవి మహిళా లోకాన్ని అవమానించేలా ఉన్నాయి. ‘నేను వదిలేసిన కార్లలోనే తిరుగుతున్నావు’ అంటూ అనితను అమర్నాథ్ను విమర్శించడం ఆయన అహంకారానికి నిదర్శనం. ప్రభుత్వ వాహనాలు ఏ ఒక్కరి వ్యక్తిగత ఆస్తులు కావు’ అని మాజీ మంత్రి సుజాత అన్నారు.

అమలాపురంలో టీడీపీ మహిళా నేతల వినూత్న నిరసన
హోంమంత్రి అనితపై వైసీపీ నేత గుడివాడ అమరనాథ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో టీడీపీ మహిళా నేతలు వినూత్న తరహాలో నిరసన తెలిపారు. అమరనాథ్ ఫ్లెక్సీని కోడిగుడ్లతో కొట్టి నిరసన వ్యక్తంచేశారు.